తెలంగాణ

telangana

Israel Ground Attack On Gaza : ముప్పేట దాడికి ఇజ్రాయెల్ సిద్ధం.. డెడ్​లైన్​ ముగింపుతో భీకర పోరుకు సన్నాహాలు!

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 6:58 AM IST

Updated : Oct 15, 2023, 9:47 AM IST

Israel Ground Attack On Gaza : హమాస్‌ మిలిటెంట్ల ఏరివేత పేరుతో గాజాపై ఇజ్రాయెల్‌ ముప్పేట దాడికి దిగబోతోంది. ఇందుకోసం వైమానిక, నౌకా, సైనిక దళాలు రంగంలోకి దిగాయి. గాజా వైపు ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు దూసుకెళుతున్నాయి. ఉత్తర గాజా నుంచి తరలి వెళ్లాలని పాలస్తీనా ప్రజలకు ఇచ్చిన గడువు ముగియడం వల్ల ఏ క్షణమైనా ముప్పేట దాడులు ప్రారంభమయ్యే అవకాశముంది. దీనికి తోడు మేమంతా సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. గాజాపై దాడి చేస్తే యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ యుద్ధనేరాలకు పాల్పడుతోందని హమాస్‌ ఆరోపిస్తోంది.

Israel Ground Attack On Gaza
Israel Ground Attack On Gaza

Israel Ground Attack On Gaza :గాజాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంది. హమాస్‌ ఉగ్రవాదుల ఉనికి లేకుండా చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నఇజ్రాయెల్‌.. గాజాపై ముప్పేట దాడికి దిగబోతోంది. దీని కోసం వైమానిక, నౌకా, సైనిక దళాలు.. భీకర పోరుకు సిద్ధమయ్యాయి. ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు గాజా సరిహద్దు వైపు దూసుకొస్తున్నాయి. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని పాలస్తీనా ప్రజలకు ఇచ్చిన గడువు ముగియడం వల్ల ఏ క్షణమైనా దాడులు ప్రారంభమయ్యే అవకాశముంది.

Israel Ground Invasion Started :గాజాపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్‌సైన్యం ప్రకటించింది. వాయు, నౌకా, సైనిక దళాలు సిద్ధమయ్యాయని తెలిపింది. విస్తృత దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. మూడు దళాలు సమన్వయంతో ఈ దాడులు చేస్తాయని ప్రకటించింది. పలు బెటాలియన్లను, బలగాలను మోహరించినట్లు.. యుద్ధం కోసం ఇజ్రాయెల్‌ అంతటినీ సర్వసన్నద్ధం చేసినట్లు వెల్లడించింది. యుద్ధంలో తదుపరి దశలకూ ప్రణాళికలు రూపొందించినట్లు.. ప్రత్యేకంగా అతి పెద్ద భూతల దాడులకు సిద్ధమయినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు యుద్ధంలో ఇరువైపుల 3,500 మంది మరణించారు.

మేమంతా సిద్ధంగా ఉన్నాం : నెతన్యాహు
గతవారం హమాస్​ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న గాజా సరిహద్దు కమ్యూనిటీలు కిబ్బట్జ్ బీరీ, కిబ్బట్జ్ క్ఫర్​ అజ్జాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం పర్యటించారు. మారణకాండ జరిగిన తీరును పారట్రూపర్​ బెటాలియన్ అధిపతి నెతన్యూహుకు వివరించారు. ఈ సందర్భంగా 'గాజా స్ట్రిప్​లో మా యోధులు ముందు వరసలో ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాము' నెతన్యాహు ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

గాజా వలస వాసుల కష్టాలు..
ఉత్తర గాజా నుంచి 24 గంటల్లో దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరించడం వల్ల 11 లక్షల మంది ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మెుత్తం 40 కిలోమీటర్ల పొడవున్న గాజాలో 20 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో రోడ్ల ధ్వంసం కావడం వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారింది. మరోవైపు శనివారం సాయంత్రం 4 గంటల కల్లా వెళ్లాల్సిందేనని ఇజ్రాయెల్‌ హెచ్చరించడం వల్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది. శుక్రవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్‌ నిరంతరాయంగా చేస్తున్న వైమానిక దాడులతో గాజా వాసులు వలస వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో సైన్యం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసింది.

శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు తరలింపు కారిడార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇళ్లను వీడి వెళ్లద్దని హమాస్‌ సూచించినా.. ప్రాణ భయంతో ప్రజలు ఉత్తర ప్రాంతాన్ని వీడుతున్నారు. ఛిద్రమైన రోడ్లతో వారి ప్రయాణానికి ఇబ్బంది కలుగుతోంది. ప్రయాణం సజావుగా సాగడం లేదు. యుద్ధం ముగిశాక మళ్లీ రావచ్చని ఇజ్రాయెల్‌ హామి ఇస్తున్నా.. గాజా వాసులకు నమ్మకం కుదరడం లేదు. తమను ఈజిప్టు సినా ప్రావిన్సుకు పరిమితం చేస్తారని భయపడుతున్నారు.

ఆస్పత్రి ఆవరణలో 35 వేల మంది శరణార్థులు..
ఉత్తర గాజాలో ఆస్పత్రులను ఖాళీచేసే పరిస్థితి లేదని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది చనిపోయారని, గాయాల పాలయ్యారని వివరిస్తున్నారు. అల్‌ అవదా ఆసుపత్రిలోని రోగులను తరలించడం కష్ట సాధ్యంగా మారంది. ఆస్పత్రి సమీపంలో బాంబులు పడడం వల్ల.. సగమంది రోగులు ఆస్పత్రి బయటే గడిపారు.

మరోవైపు, దాదాపు 35,000 వేల మంది శరణార్థులు గాజా నగర ప్రధాన షిఫా ఆస్పత్రి గ్రౌండ్​లకు వచ్చారు. ఆస్పత్రి భవనం లోపల, బయట జన కిక్కిరిసిపోయారని ఆస్పత్రి డైరెక్టర్ జనరల్ తెలిపారు. వారి ఇళ్లు ధ్వంసమైన తర్వాత.. ఆస్పత్రి సురక్షితమైన స్థలంగా భావించి ఇక్కడకు వచ్చారని ఓ అధికారి తెలిపారు.

రోగులను తరలించడం అసాధ్యం..
తమ శిబిరాల్లో వారిని తరలించడం అసాధ్యమని ఐరాస సహాయక సంస్థ UNRWA పేర్కొంది. యుద్ధానికి నిబంధనలు ఉంటాయని, అన్ని లక్షల మందిని 24 గంటల్లో ఎలా తరలించగలమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రశ్నించారు. అటు.. విదేశీయులు రావడానికి వీలుగా దక్షిణ రఫాలోని సరిహద్దును తెరుస్తున్నట్లు ఈజిప్టు ప్రకటించింది. గాజా వాసులకు మాత్రం ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది.

యుద్ధానికి సై అన్న హెజ్​బొల్లా, ఇరాన్!
Iran Warning To Israel : ఇక గాజాపై దాడులు కొనసాగితే యుద్ధం మరింత విస్తరించి ఇజ్రాయెల్‌కు భూకంపం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. హెజ్‌బొల్లా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లెబనాన్‌, ఇజ్రాయెల్‌ సరిహద్దులో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెలోని షెబా ఫార్మ్‌, కఫర్‌ చౌబాలపై హెజ్‌బొల్లా కాల్పులు జరిపింది. షెబా ఫార్మ్‌పై గైడ్‌డ్‌ క్షిపణులను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది. అటు ఇజ్రాయెల్‌ యుద్ధనేరాలకు పాల్పడుతోందని హమాస్‌ ఆరోపిస్తుంది. మానవతా సాయాన్ని గాజాలోకి రాకుండా చేస్తోందని హమాస్‌ అధినేత ఇస్మాయిల్‌ హనియా ఆక్షేపించారు. ఇజ్రాయెల్ ఆరాచకాలు యుద్ధ నేరం కిందకే వస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌కు లేఖ రాశారు.

ఆపరేషన్​ అజయ్​.. దిల్లీకి చేరిన మరో రెండు విమానాలు..
ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను తరలిస్తున్న మూడు, నాలుగు విమానాలు దిల్లీకి చేరుకున్నాయి. మూడో విమానంలో 197 మంది భారత్‌కు రాగా.. నాలుగో విమానంలో 274 మందిని తీసుకొచ్చినట్లు విదేశాంగమంత్రి జైశంకర్‌ వెల్లడించారు. వీరికి విమానాశ్రయంలో కేంద్రమంత్రులు కౌషల్‌ కిశోర్‌, వీకే సింగ్​ స్వాగతం పలికారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో 918 మందిని భారత్‌కు తీసుకొచ్చారు. మిగిలిన వారి కోసం ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖ కూడా 24 గంటల కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి అక్కడి భారతీయుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తోంది

Hezbollah Israel Conflict : ఇజ్రాయెల్‌కు 'హిజ్బుల్లా' సవాల్‌.. లక్షకు పైగా రాకెట్లతో!

Hamas Targets : హమాస్‌ 'టాప్​ సీక్రెట్స్'​ లీక్​.. చిన్న పిల్లల స్కూళ్లే ఫస్ట్​ టార్గెట్​.. బందీలను చేసి..

Last Updated : Oct 15, 2023, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details