తెలంగాణ

telangana

By

Published : Jun 22, 2021, 10:29 AM IST

Updated : Jun 22, 2021, 2:40 PM IST

ETV Bharat / crime

టీకాల పేరుతో నిర్మాత సురేశ్‌ బాబుకు టోకరా

కరోనా టీకా పేరుతో సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి సినీ నిర్మాత సురేశ్​ బాబునే మోసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

cine-producer-suresh-babu-cheated-by-a-person-in-the-name-of-vaccine
టీకా పేరుతో నిర్మాత సురేష్​ బాబును మోసం చేసిన దుండగుడు

కరోనా టీకాల పేరుతో ప్రముఖులను మోసం చేస్తన్న వ్యక్తి బాగోతం బయటపడింది. సినీ రంగానికి చెందిన వ్యక్తులతో పాటు, ఎంటర్​టైన్​మెంట్ ఛానళ్లను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తున్న నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా పరిచయం చేసుకొని.. వాక్సిన్లను సరఫరా చేస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయడం నిందితుడి ప్రత్యేకత. పది రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్​ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సినీ నిర్మాత సురేష్ బాబును మోసం చేసినందుకు గాను తాజాగా జూబ్లీహిల్స్ పీఎస్​లోనూ నాగార్జునపై కేసు నమోదైంది.

నిందితుడు నాగార్జున

గత నెల 31వ తేదీన సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తనకు తాను వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే నాగార్డున రెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. వాక్సిన్ల సరఫరాలో మీకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని... ఆ మేరకు మీకు వాక్సిన్​ ఇస్తానని నాగార్జున రెడ్డి నమ్మబలికాడు. తన వద్ద 500 డోసులు ఉన్నాయని తెలిపాడు. అతని మాటలు నమ్మిన సురేష్ బాబు... తన నిర్మాణ సంస్థలోని కార్మికులకు, సిబ్బందికి టీకా వేయించొచ్చని ఆలోచించారు. ఒప్పందం కుదుర్చుకుని.... అతను అడిగిన లక్ష రూపాయలను సురేష్​బాబు కార్యాలయ మేనేజర్ చెల్లించాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచాఫ్ వచ్చింది.

15 రోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి.. చివరికి నిన్న సురేష్ బాబు మేనేజర్ రాజేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో నాగార్జున రెడ్డి పలువురిని మోసం చేశాడు. ఓ ప్రముఖ ఛానల్​కు ఫోన్ చేసి వాక్సిన్ల సరఫరా కోసం లక్షన్నర రూపాయలను ఖాతాలో జమ చేయించుకున్నాడు. సినీ హీరో అలీ కార్యాలయానికి ఫోన్ చేసి ఇలాగే నమ్మించి 70వేల రూపాయలు వసూలు చేశాడు. ఈ విధంగా అతనిపై 7 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రముఖ ఛానల్ ఇచ్చిన కేసులో... నాగార్జునను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు రిమాండ్​కు తరలించారు. 4 రోజులు కస్టడీలోకి తీసుకొని నాగార్జున రెడ్డి మోసాల చిట్టాను బయటికి తీశారు.

ఘనమైన నేరచరిత్ర

నాగార్జున రెడ్డికి ఘనమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయవాడకు చెందిన నాగార్జున తండ్రి చనిపోవడంతో, తల్లి హోటళ్లలో పనిచేస్తూ కూతురు పెళ్లి చేసి, కుమారుడిని చదివించింది. ఇంటర్ హైదరాబాద్​లో పూర్తి చేసిన నాగార్జున... హోటల్ మేనేజ్​మెంట్ చేయడానికి చెన్నై వెళ్లాడు. అక్కడ చదువు పూర్తి చేసి... మళ్లీ హైదరాబాద్​కు వచ్చాడు. సినీ రంగంపై ఉన్న ఆసక్తితో అందులో పనిచేసే కార్మికులతో పరిచయం పెంచుకున్నాడు. చిన్న చిన్న పనులు చేస్తూ కాలం వెల్లదీసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగార్జున రెడ్డి అతనికి వచ్చే డబ్బులతో ఖర్చులు సరిపోకపోవడంతో అడ్డదారులు తొక్కాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్, విజయవాడలో మోసాలకు పాల్పడ్డాడు. ఎయిర్​టెల్ ఫ్యాన్సీ నెంబర్లు ఇప్పిస్తానని... పలువురితో రూ.5వేల నుంచి 50వేల వరకు వసూలు చేశాడు. ఇలా విజయవాడలో ఒకసారి, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో నమోదైన కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తల్లితో కలిసి చెన్నై వెళ్లి అక్కడ హోటల్​లో పనిచేస్తున్నాడు. గతేడాది లాక్​డౌన్ వల్ల హోటళ్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయాడు. దీంతో మరోసారి మోసాలబాట పట్టాడు. ఈసారి వాక్సిన్ల పేరిట మోసాలకు పాల్పడేందుకు మార్గం ఎంచుకున్నాడు. దీనికోసం ఫేస్​బుక్, ఇతర మార్గాల్లో పలువురి నెంబర్లు సేకరించాడు. నాగార్జున రెడ్డి వసూలు చేసే డబ్బులను అతని అమ్మ లక్ష్మి ఖాతాలో జమ చేయించాడు. కానీ ఈ నేరాలపై ఆమెకు ఏమాత్రం అవగాహన లేదు.

జూబ్లీహిల్స్ పోలీసులు నిర్మాత సురేష్ బాబును మోసం చేసిన కేసులో దర్యాప్తు చేస్తున్నారు. పీటీ వారెంట్​పై నాగార్జున రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

ఇదీ చూడండి:సైబర్ మోసం: వ్యాక్సిన్ పేరుతో రూ. లక్షా 10 వేలు స్వాహా..

Last Updated : Jun 22, 2021, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details