తెలంగాణ

telangana

అయోధ్యలో ఎలుకల గండం.. 'ఏం చేస్తే పోతాయి?'

By

Published : Aug 8, 2020, 9:49 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా అయోధ్యలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసి.. వాటి బెడద నుంచి తప్పించుకుందామన్నా.. అస్సలు కుదరట్లేదు. పంట నాశనం చేస్తూ.. అన్నదాతలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి.

ayodhya
అయోధ్యలో ఎలుకల గండం.. 'ఏం చేస్తే పోతాయి?'

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అయోధ్య గ్రామంలో ఎలుకల సంతతి పెరిగిపోయి పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న కండేలను పూర్తిగా కొరికేస్తున్నాయి. ఈ గ్రామంలో ఇప్పటికే పది ఎకరాల మొక్కజొన్న పంటను నాశనం చేశాయి ఎలుకలు. సుమారు ఇరవై ఎకరాల చెరకు పంటను కోరికివేశాయి. వరి నారుమడులను కూడా దారుణంగా నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఇళ్లలో కూడా ఎలుకల బెడదతో సతమతం అవుతున్నారు అన్నదాతలు.

ఎకరం పొలంలో ఎలుకల నివారణకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఎలుకలతో కౌలుకు సాగు చేసుకునే రైతులు భారీగా నష్టపోతున్నారు. కొంతమంది రైతులు పంటను వదిలేసే పరిస్థితికి వచ్చారు. చెరుకు పంటను ట్రాక్టర్ల చేత దున్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ అధికారులు ఈ గ్రామం వైపు రావడం లేదని రైతులు వాపోతున్నారు. పంట పొలాలు పరిశీలించి.. అయోధ్య పరిసర గ్రామాల్లో ఎలుకల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:విశాఖ: అవుటర్‌ ఫిషింగ్ హార్బర్‌లో తగలబడిన బోటు

ABOUT THE AUTHOR

...view details