తెలంగాణ

telangana

ETV Bharat / business

'2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌'

India Overtake Japan Economy: ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ 2030 నాటికి జపాన్​ను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాజా ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ నివేదిక అంచనా వేసింది. 2021లో 2.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ (నామినల్‌).. 2030 నాటికి 8.4 ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని నివేదిక పేర్కొంది.

By

Published : Jan 8, 2022, 5:01 AM IST

India Overtake Japan Economy
భారత ఆర్థిక వ్యవస్థ

India Overtake Japan Economy: 2030 నాటికి జపాన్‌ను అధిగమించి భారత్‌ ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాజా ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ నివేదిక అంచనా వేసింది. అలాగే జర్మనీ, యూకేలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, యూకే తర్వాత భారత్‌ ఆరో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉంది.

Indian Economy: 2021లో 2.7 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ (నామినల్‌).. 2030 నాటికి 8.4 ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవనుందని తెలిపింది. ఇందుకు అనేక అంశాలు దోహదం చేయనున్నాయని పేర్కొంది. దేశంలో మధ్యాదాయ కుటుంబాలు గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. దీంతో వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని వివరించింది. 2020లో 1.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న వినిమయ వ్యయం.. 2030 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనుందని అంచనా వేసింది.

India GDP: 2020-21లో -7.3 శాతానికి క్షీణించిన భారత జీడీపీ (రియల్‌).. ఈ ఆర్థిక సంవత్సరం + 8.2 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ అంచనా వేసింది. 2022-23లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ అదే జోరును కొనసాగిస్తూ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ప్రజల వినిమయ శక్తి పెరగడంతో పాటు దేశీయంగా అనేక పరిశ్రమలు వృద్ధి చెందాయని పేర్కొంది. దీంతో అనేక బహుళజాతి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపింది.

India GDP In 2030: డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌లో ప్రస్తుతం వస్తోన్న మార్పులు ఈ-కామర్స్‌ తద్వారా కన్జ్యూమర్‌ మార్కెట్‌ రూపురేఖల్ని మార్చనుందని నివేదిక తెలిపింది. ఈ క్రమంలో 2020లో 500 మిలియన్లుగా ఉన్న ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2030 నాటికి 1.1 బిలియన్లకు చేరనుందని అంచనా వేసింది. అలాగే ఈ-కామర్స్‌ వృద్ధి, 4జీ, 5జీ సాంకేతిక అందుబాటులోకి రానుండడంతో దేశీయ యూనికార్న్‌ సంస్థలు భారీ వృద్ధి సాధించనున్నాయని తెలిపింది. అలాగే 2020, 2021 తరహాలోనే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

వాహన, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్స్‌, సర్వీసెస్‌ రంగాలతో పాటు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌, ఐటీ వంటి రంగాలకు దీర్ఘకాల వృద్ధి నమోదు చేసే విపణిగా భారత్‌ నిలవనుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలవడమే అందుకు కారణమని తెలిపింది.

ఇదీ చదవండి:'2021-22లో భారత వృద్ధి రేటు 9.2 శాతం!'

ABOUT THE AUTHOR

...view details