స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గ్రామ సర్పంచే టీచర్ అవతారం ఎత్తారు. ఓ వైపు గ్రామ పరిపాలన బాధ్యతలు చూసుకుంటూనే.. పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. మహారాష్ట్ర సోలాపుర్లోని సాల్ఘర్ ఖుర్ద్ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడి జిల్లా పరిషద్ పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగో తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఈ స్కూల్లో కొన్నేళ్ల నుంచి ఒకే టీచర్ ఉంటున్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నా.. ఎలాంటి ఫలితం లేదు. విద్యాశాఖకు మొరపెట్టుకున్నా.. స్కూల్కు కొత్తగా టీచర్లు ఎవరూ రాలేదు.
ఉపాధ్యాయులు లేని కారణంగా విద్యార్థులు నష్టపోకూడదని భావించిన గ్రామ సర్పంచ్ ఆర్తి అజయ్ కాంబ్లే.. స్వయంగా పాఠాలు బోధించేందుకు ముందుకొచ్చారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూనే.. మరోవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రస్తుతం స్కూల్లో టీచర్గా ఉన్న అప్ప సవిసర్జేతో కలిసి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు ఆర్తి కాంబ్లే. ఒకటో తరగతి విద్యార్థుల బాధ్యతలను ఆర్తి చూసుకుంటున్నారు. మరో వలంటీర్ సైతం వీరికి సహకరిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే ప్రంజలి మహేశ్ మస్కే అనే వలంటీర్ సైతం స్కూల్లో పాఠాలు చెబుతున్నారు.