తెలంగాణ

telangana

'వారసత్వ రాజకీయాలు ప్రమాదకరం.. అందుకే వారికి టికెట్ కట్​'

By

Published : Mar 15, 2022, 12:25 PM IST

Updated : Mar 15, 2022, 3:11 PM IST

PM Modi News: భాజపా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకే పార్టీ నేతల పిల్లలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించలేదన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ రాజకీయాలు శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు.

BJP parliamentary meeting
మోదీ, నడ్డాను సన్మానిస్తున్న భాజపా నేతలు

Dynasty politics: ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దానిపై అంతా కలిసికట్టుగా పోరాడాలని భాజపా ఎంపీలకు సూచించారు. భాజపా నేతల్లో కొంతమంది పిల్లలకు టికెట్లు కేటాయించకపోవడానికి కూడా కారణం ఇదే అని మోదీ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ రాలేదంటే అందుకు పూర్తి బాధ్యత తనదే అని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లో వారసత్వ రాజకీయాలపై పోరాడాలంటే ముందు సంస్థాగతంగా మనం దాన్ని అనుసరించాలని సూచించారు. దిల్లీలో నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈమేరకు మాట్లాడారు.

BJP parliamentary meeting

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు గానూ భాజపా నేతలు మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను సన్మానించారు. ఇద్దరికీ గజమాల వేసి సత్కరించారు.

మోదీ, నడ్డా
మోదీ, నడ్డాను సన్మానిస్తున్న భాజపా నేతలు

ది కశ్మీర్ ఫైల్స్​పై ప్రశంసలు..

ఇటీవల విడుదలై బాలీవుడ్​లో సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాలు తరచూ రావాలని ఆకాంక్షించారు. చరిత్రను ప్రజలకు తెలియజేసే విషయంలో చిత్రపరిశ్రమ పాత్రను మోదీ ప్రస్తావించారు. భావప్రకటనా స్వేచ్ఛను కూడా కొందరు వ్యక్తపరచనివ్వడం లేదని విమర్శించారు.

"పుస్తకాలు, సాహిత్యం, కళల ద్వారానే కాదు.. సినిమాల ద్వారా కూడా చరిత్రను కళ్లకుగట్టవచ్చు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. వారిపై సినిమాలను రూపొందించారు. కానీ జాతిపిత మహాత్మా గాంధీ కథపై సినిమాలు రాలేదు. హాలీవుడ్​లో ఓ సినిమా తెరకెక్కితే దానికి అవార్డులు వచ్చాయి. అప్పుడే గాంధీ గొప్పతనం గురించి ప్రపంచ దేశాలకు ఇంకా ఎక్కువ తెలిసింది. ఎమర్జెన్సీ వంటి అంశాలపై సినిమాలు రావాల్సింది. కానీ కొందరు వాటిని తెరకెక్కనివ్వలేదు. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి దేశమంతా చర్చిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా కొందరు అడ్డుపడుతున్నారు. నిజానిజాలను తెలుసుకోవాల్సింది పోయి అపకీర్తి పాలు చేసేందుకు ప్రచారాలు చేస్తున్నారు."

-పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ

Modi latest news

అలాగే భాజపాకు తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో 100 బూత్​లను గుర్తించి.. పార్టీకి ఓటు వేయకపోవడానికి కారణాలేంటో గుర్తించాలని మోదీ.. ఎంపీలకు సూచించినట్లు పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు. అంతేగాక భాజపా విజయానికి సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్పినట్లు పేర్కొన్నారు.

మోదీ, నడ్డాను సన్మానిస్తున్న భాజపా నేతలు
మోదీ, నడ్డాను సన్మానిస్తున్న భాజపా నేతలు

ఆపరేషన్​ గంగ ద్వారా ఉక్రెయిన్​లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి తరలించిన విషయంపై కేంద్రమంత్రి ఎస్​ జైశంకర్​ ఈ సమావేశంలో ప్రజెంటేషన్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా భాజపా ముందుకెళ్తున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే సమయంలో ఎలాంటి వివరాలు లేకుండా ప్రతిపక్షాలు రాజకీయం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారన్నారు. భారతీయులకు పోలండ్​ సహకరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారన్నారు.

ఇదీ చదవండి:హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన.. ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

Last Updated : Mar 15, 2022, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details