కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్డీఏ కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా ప్రసంగించారు మోదీ.
'సురాజ్యం కోసం శ్రమిద్దాం...'
నూతన భారత్ను నిర్మించేందుకు సరికొత్త ప్రయాణం మొదలైందని వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీ.
ఎవరి విశ్వాసాలను అగౌరపరచకుండా, ఏ వర్గం పట్ల నిర్లక్ష్యం చూపకుండా సుపరిపాలన అందించాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు.
"1857నాటి స్ఫూర్తిని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి. బానిసత్వం నుంచి విడుదలకు భుజం.. భుజం కలిపి పోరాడారు. ప్రస్తుతం మంచి రాజ్యం కోసం, పేదరికం నుంచి విడుదలకు పోరాడాలి. ఐకమత్యంతో పోరాటం సాగించాలి. అందరినీ కలుపుకుపోవాలి. భయపడుతున్నామనే ఆరోపణలను మన జీవన విధానంతో తప్పని నిరూపించాలి. భాజపాకు ఓటు వేసినవారు, వ్యతిరేకించేవారు ఇద్దరూ మనవారే. 130కోట్ల జనాభాలో మనకు భేద భావాలు ఉండకూడదు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అనేది మన నినాదం... ఇప్పుడు దానికి సబ్కా విశ్వాస్నూ చేర్చాలి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి