తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విజయంపై ధీమాగా భాజపా-శివసేన!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల చివరిరోజున ప్రముఖ రాజకీయ నేతలు అక్కడ నామపత్రాలు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్​, శివసేన నేత ఏక్​నాథ్​ శిందే, ఎన్సీపీ నేత అజిత్​ పవార్​లు నామినేషన్లు సమర్పించారు. అక్టోబర్​ 21న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.

By

Published : Oct 4, 2019, 7:33 PM IST

Updated : Oct 4, 2019, 7:46 PM IST

మహా పోరు: నామినేషన్లకు ముగిసిన గడువు.. విజయంపై భాజపా ధీమా

నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన శుక్రవారం.. మహారాష్ట్రలో ప్రముఖ నేతలు తమ నామపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో భాజపా తరఫున తొలి సీఎం ఫడణవిస్.. నాగ్​పుర్​ సౌత్​వెస్ట్​ నుంచి ​బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ, మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​లతో కలిసి వెళ్లిన ఫడణవిస్​ నామినేషన్​ వేశారు. కాంగ్రెస్​ అభ్యర్థి ఆశిశ్​ దేశ్​ముఖ్​తో ఎన్నికల్లో తలపడనున్నారు ముఖ్యమంత్రి.

ఆర్థిక మంత్రి, భాజపా నేత సుధీర్​ ముంగంటివార్​ బల్లార్​పుర్​ నుంచి పోటీ చేస్తున్నారు. మరో మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్​ షిరిడీ, మాజీ మంత్రి గణేశ్​ నాయక్​ ఏరోలి నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.

శిందే, పవార్​ కూడా...

కోప్రీ పఛ్​పఖాడీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న శివసేన నేత, మంత్రి ఏక్​నాథ్​ శిందే ఇవాళ నామపత్రం సమర్పించారు.

బారామతి సిట్టింగ్​ ఎమ్మెల్యే ఎన్సీపీ నేత అజిత్​ పవార్ ​ఇదే సెగ్మెంట్​​ నుంచి నేడు నామినేషన్​ వేశారు. భాజపాకు చెందిన గోపీచంద్​ పాడల్కర్​తో అమీతుమీ తేల్చుకోనున్నారు. నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. అక్టోబర్​ 5న నామపత్రాలు పరిశీలించనున్నారు. అక్టోబర్​ 7న ఉపసంహరణకు తుది గడువు. అక్టోబర్​ 21న ఎన్నికలు నిర్వహించి.. 24న ఫలితాలు ప్రకటించనున్నారు.

విజయం మాదే...

తమ సిద్ధాంతాల్లో తేడాలున్నప్పటికీ.. హిందుత్వ ధోరణితోనే ముందుకెళ్లి అధికారాన్ని నిలుపుకుంటామన్నారు ముఖ్యమంత్రి ఫడణవిస్​. నేడు నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో శివసేన, భాజపా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఎన్నికల్లో విజయం తమ 'మహాయుతి' కూటమిదే అని ధీమా వ్యక్తం చేశారు ఫడణవిస్​, ఉద్ధవ్​ ఠాక్రే.

మొత్తం 288 స్థానాల్లో... శివసేన 126, మిగతా మిత్రపక్షాలకు 14 స్థానాలు మినహా.. అన్ని సీట్లలో భాజపా పోటీ చేస్తోందని ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆదిత్య ఠాక్రే మంచి మెజారిటీతో భారీ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెబల్​ అభ్యర్థుల్ని.. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు.

Last Updated : Oct 4, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details