తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 5:49 AM IST

ETV Bharat / bharat

సరిహద్దుల్లో క్యూఆర్​ శామ్​ను మోహరించిన భారత్​

తూర్పు లద్దాఖ్​ వెంబడి చైనా.. తన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు మెహరిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది. తన అమ్ముల పొదిలోని అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థను సరిహద్దుల్లో మోహరించింది. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ధీటైన జవాబు ఇచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.

India deployed QR Sam on the borders
సరిహద్దుల్లో క్యూఆర్​ శామ్​ను మోహరించిన భారత్​

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా యుద్ధవిమానాలు, హెలికాప్టర్‌ కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. తన అమ్ములపొదిలోని అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌లో మోహరించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో కూడిన ఈ సత్వర ప్రతిస్పందన వ్యవస్థ (క్యూఆర్‌ శామ్‌)ను చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా నిరోధించేందుకు రంగంలోకి దించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైన్యంతోపాటు మన వైమానిక దళం కూడా గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు వివరించాయి.

కొన్ని వారాలుగా చైనా తన భారీ యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30, వ్యూహాత్మక బాంబర్లను ఎల్‌ఏసీకి చేరువలోకి తెచ్చింది. అవి భారత భూభాగానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14, 15, 17, 17ఎ (హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతం), పాంగాంగ్‌ సరస్సు, ఫింగర్‌ ప్రాంతాల వద్ద చైనా హెలికాప్టర్ల కదలికలను మన సైన్యం గుర్తించింది.

సెకన్లలోనే కూల్చివేత

క్యూఆర్‌ శామ్‌ వ్యవస్థలో 'ఆకాశ్‌' క్షిపణులు ఉంటాయి. వేగంగా దూసుకొస్తున్న యుద్ధవిమానాలు, డ్రోన్లను అవి సెకన్ల వ్యవధిలోనే నేలకూల్చగలవు. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి వీలుగా ఈ వ్యవస్థకు ఇప్పటికే అనేక మార్పులు, ఆధునికీకరణలు చేపట్టారు.

నిఘా తీవ్రతరం

తూర్పు లద్దాఖ్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ, మిగ్‌-29 వంటి యుద్ధవిమానాలు చురుగ్గా గస్తీ తిరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో బాంబులు, క్షిపణులతో అవి.. సమీపంలోని మైదాన ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాల నుంచి నింగిలోకి లేస్తున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి గగనతల నిఘాపరంగా ఉన్న లోపాలను కూడా భారత సైనిక దళాలు సరిదిద్దాయి. ఫలితంగా చైనా యుద్ధవిమానాలేవీ మన బలగాల కళ్లుగప్పి అక్కడ సంచరించే అవకాశం లేదు.

పాక్‌పైనా..

చైనా కూడా అక్సాయ్‌ చిన్‌లో విమాన విధ్వంసక క్షిపణులను ఇప్పటికే మోహరించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను భారత్‌ జాగ్రత్తగా గమనిస్తోంది. తానూ దీర్ఘ శ్రేణి అస్త్రాలను రంగంలోకి దించింది. మరోవైపు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్‌ బలగాల కదలికలపైనా మన సైన్యం కన్నేసి ఉంచింది.

రోడ్లతో అనుసంధానం

తూర్పు లద్దాఖ్‌లో దార్బుక్‌-ష్యోక్‌-దౌలత్‌ బేగ్‌ ఓల్డీ రోడ్డు పూర్తయిన నేపథ్యంలో భారత సైనిక ఇంజినీర్లు ఇప్పుడు వివిధ గస్తీ శిబిరాలను రోడ్లతో సంధానిస్తున్నారు. తద్వారా.. సరిహద్దుల్లో చైనా ఏదైనా దుస్సాహసానికి దిగితే వేగంగా సైనికులను తరలించడానికి భారత్‌కు వీలవుతుంది.

ఒంటరిగానే డ్రాగన్‌కు చెక్‌

ఒకవేళ చైనా దాడికి దిగితే.. భారత్‌ తన మిత్ర దేశమైన అమెరికా సాయాన్ని కోరుతుందని అనేక మంది పాశ్చాత్య విశ్లేషకులు చెబుతున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఒంటరిగానే డ్రాగన్‌ను ఎదుర్కోవాలని కృతనిశ్చయంతో ఉంది. నేల, నింగితోపాటు సముద్రంలోనూ అప్రమత్తత ప్రకటించింది. హిందూ మహాసాగరంలో భారత యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉద్ధృతంగా గస్తీ తిరుగుతున్నాయి.

హామీ నిలబెట్టుకోవాల్సిందే

ఎల్‌ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన ఏర్పడిన నాలుగు ప్రాంతాల్లో రెండు చోట్ల ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పశ్చిమ సెక్టార్‌లో మోహరించిన తన బలగాలను వెనక్కి తీసుకుంటానంటూ ఈ నెల 6న ఇచ్చిన హామీని చైనా నిలబెట్టుకోవాల్సిందేనని భారత్‌ స్పష్టం చేస్తోంది. "సరిహద్దుల్లో ఏకపక్షంగా పరిస్థితులను మార్చేందుకు చైనా ప్రయత్నించింది. అందువల్ల యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆ దేశానిదే" అని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. సైనిక ప్రతిష్టంభనల ద్వారా కొత్తరకం ఆనవాయితీని చైనా సైన్యం కొనసాగించడానికి వీల్లేదన్నది భారత ప్రభుత్వ వైఖరి అని తెలిపారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details