తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2020, 9:23 PM IST

Updated : Feb 28, 2020, 10:53 AM IST

ETV Bharat / bharat

పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ.. ఎందుకంటే?

సాయం చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు మంచి మనసుంటే చాలు అని నిరూపించారు కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా. అతను నిరక్షరాస్యుడు అయినప్పటికీ, ఆర్థికంగా స్థితిమంతుడు కానప్పటికీ, బత్తాయి పండ్లు అమ్ముతూ ఎందరో పిల్లలకు అక్షర దానం చేస్తున్నారు. తనలా ఎవరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోకూడదని పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. అతని గురించి తెలుసుకుందాం?

Harekula HAJABBA
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ...ఎందుకంటే?

పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కర్ణాటకకు చెందిన హరేకల హజబ్బా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. స్వతహాగా పండ్ల వ్యాపారి అయిన ఆయన... తనలా ఎవరూ నిరక్షరాస్యులుగా మిగిలిపోకూడదని భావించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి విద్యను దానం చేస్తున్నారు.

ఇదీ కథ

దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామానికి చెందిన హరేకల హజబ్బా స్థానికంగా బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఓ సారి ఆంగ్ల భాషరాక ఎదుర్కొన్న సంఘటనతో తనలాగా ఇంకెవరికి అలాంటి సమస్య అడ్డుకాకూడదని భావించారు. అలా 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో ఉన్నత విద్యా పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతలు నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వ అధికారుల సహాయంతో న్యూపడపు గ్రామంలో పాఠశాల నిర్మించారు.

''ఒకసారి ఓ విదేశీ జంట నా వద్దకు వచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. నాకు ఆంగ్లం రాదు. వారికి నేను స్థానిక భాషలో చెప్పిన సమాధానం ఎంతకీ అర్థం కాలేదు. దీంతో ఆ జంట విసుగుపుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో నేను ఎంతో బాధపడ్డాను. నేను చదుకుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అనుకొన్నాను. చదువుకోకపోవడం వల్లనే నా భాష వారికి అర్థం కాలేదు. నాలాగా ఎవరూ బాధపడొద్దని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే పేద పిల్లలకు చదువు కోసం సహాయం చేయడం ప్రారంభించాను. ప్రస్తుతం మా గ్రామంలో పేద పిల్లలందరు పాఠశాలలో చదువుకుంటున్నారు''

- హజబ్బా, పండ్ల వ్యాపారి, ప్రద్మశ్రీ గ్రహీత.

నమ్మలేదు...

కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయాన్ని తొలుత హజబ్బా నమ్మలేదు. అక్కడి డిప్యూటీ కమీష​నర్​ కార్యాలయ సిబ్బంది చెప్పగా నమ్మారు.

"నాకేం అర్థం కాలేదు. తర్వాత రేషన్‌ షాపు ముందు క్యూలో ఉన్న నా వద్దకు దక్షిణ కన్నడ డిప్యూటీ కమీషనర్‌ కార్యాలయ సిబ్బంది వచ్చారు. నాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినట్లు తెలిపారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అంతా కలలా అనిపించింది. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది.''

- హజబ్బా.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ఓ కళాశాలను నెలకొల్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే హజబ్బా చేస్తున్న సేవల గురించి తెలుసుకొని ఎంతో మంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అమెరికా!

Last Updated : Feb 28, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details