మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనుంది. మహారాష్ట్ర తరహాలో హరియాణాలోనూ భాజపా విజయదుందుబి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. కమలదళం రికార్డు స్థాయిలో సీట్లు గెల్చుకుంటుందని అంచనా వేశాయి. మరి అవి నిజమవుతాయో... లేక ఐదేళ్ల అనంతరం కాంగ్రెస్ తిరిగి పగ్గాలు చేపడుతుందో గురువారం మధ్యాహ్నానికి స్పష్టత వస్తుంది.
హరియాణాలో 90 స్థానాలు ఉండగా 11 వందల 69 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.కోటీ 83 లక్షల మంది ఓటర్లలో 65 శాతం మంది ఈనెల 21న ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లెక్కింపునకు సర్వం సిద్ధం....
ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైంది. అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా.. పరిసర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాల్ని మోహరించారు.
భాజపా-కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ...
భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఈసారి ప్రధాన పోటీ ఉండగా.. రెండు పార్టీలు ఒంటరిగానే 90 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఐఎన్ఎల్డీ నుంచి వేరుపడి, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ జననాయక్ జనతా పార్టీ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. బీఎస్పీ 87 స్థానాల్లో పోటీ చేయగా, ఐఎన్ఎల్డీ 81 సీట్లలో బరిలో నిలిచింది. మరో 375 మంది స్వతంత్రులు కూడా పోటీ చేశారు.