తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ పోలీసులపై రాడ్​లు, కర్రలతో దాడి!

మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలతో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పంజాబ్‌ పోలీసు బృందంపై స్థానికులు దాడి చేసిన ఘటన హరియాణాలో జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి.

By

Published : Oct 10, 2019, 11:48 AM IST

పంజాబ్​ పోలీసులపై రాడ్​లు, కర్రలతో దాడి

పంజాబ్​ పోలీసులపై కొందరు దుండగులు విరుచుకుపడ్డారు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్‌లోని బతిండా పోలీసులు... హరియాణలోని దేశు జోదా గ్రామానికి చెందిన కుల్వీందర్‌ సింగ్‌ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా నిందితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ఎదురుతిరగడం వల్ల ఆ గ్రామం రణరంగంగా మారింది.

పంజాబ్​ పోలీసులపై హరియాణాలో విచక్షణారహితంగా దాడి

స్థానికులు, కుల్వీందర్ కుటుంబ సభ్యులు రాడ్‌లు, కర్రలతో పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కుల్వీందర్ కుటుంబ సభ్యులు కాల్పులకు దిగడం వల్ల పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో కుల్వీందర్‌ మామ జగ్గా సింగ్ మృతి చెందగా ఇద్దరు పోలీసులకు తూటా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు పంజాబ్ పోలీసులను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై హరియాణా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ డీజీపీ... హరియాణా పోలీసులను కోరారు. హరియాణా పోలీసులు మాత్రం పంజాబ్ పోలీసులు... స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లారని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బతిండా పోలీసులు స్థానిక పోలీసుల సాయం తీసుకోవాల్సి ఉందని హరియాణా అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details