ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డంపింగ్ యార్డుల్లా చెత్త శుద్ధి కేంద్రాలు

By

Published : Oct 22, 2020, 5:09 PM IST

పచ్చదనంతో.... ఆహ్లాదకరమైన వాతావరణంలో పట్టణాలు ఉండాలని... ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెత్తశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కోటి రూపాయలకుపైగా నిధులు ఖర్చు చేసి పార్కుల్లా మార్చిన చెత్త శుద్ధి కేంద్రాలు నేడు డంపింగ్‌ యార్డుల్లా మారాయి. నెల్లూరు జిల్లాలోని కావలి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉండటంతో... స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

garbage plants
డంపింగ్ యార్డుల్లా చెత్త శుద్ధి కేంద్రాలు

డంపింగ్‌ యార్డుల్లో ఉండాల్సిన చెత్తా చెదారం కావలి శివారుల్లో రోడ్డుకు ఇరువైపులా దర్శనమిస్తోంది. తుమ్మలపెంట రోడ్డు, బుడంగుంట, మద్దూరుపాడు, ముసునూరు వెళ్లే మార్గంలో చెత్త కుప్పలుతెప్పలుగా ఉంటుంది. పట్టణంలోని తుఫాన్ నగర్, వెంగళ్రావునగర్, రాజీవ్ నగర్, రామూర్తిపేట, పాతూరు, వైకుంఠపురం కాలనీల్లో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. 40వార్డులు, 1.20లక్షల జనాభాతో కావలి ప్రస్తుతం పట్టణంగా విస్తరించింది. చెత్త నుంచి సంపద తయారు చేసేందుకు గత ప్రభుత్వంలో మోర్లవారిపాలంలో చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. కోటి రూపాయలు వెచ్చించి... అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు దీని పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో చెత్తచెత్తాదారం పెరిగిపోవటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... కావలి పట్టణాన్ని చక్కటి పురపాలక సంఘంగా మార్చడానికి కృషి చేస్తున్నట్లు పురపాలక సంఘం కమిషనర్‌ తెలిపారు. పురపాలక సంఘం పరిధిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఉన్న చెత్త శుద్ధి కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details