Nara Lokesh letter to PM Modi: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. భారతదేశంలో స్మగ్లింగ్పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 2021 - 2022 నివేదిక ప్రకారం డ్రగ్స్ వాడకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న నారా లోకేశ్.. గత 4 ఏళ్లలో దేశానికి మాదకద్రవ్యాల కేంద్రంగా ఏపీ మారుతుండటం తీవ్ర బాధాకరమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యమవుతున్నాయని, యువత వాటి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మాదకద్రవ్యాల వ్యాప్తి విద్యా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, మద్యం సేవించి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉందని అన్నారు. వీరి బారిన పడి.. ఇటీవల.. 571 మంది యువకులు తమ జీవితాలను ముగించినట్లు అధ్యయనాలు చెప్తున్నాయని.. ఇది ఎంతో బాధాకరమని.. రాష్ట్రంలో 18 వేల 267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ నివేదిక చెప్తోందన్నారు.
కందుకూరు, అనకాపల్లి మండలాల్లో డ్రగ్స్ వల్ల పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా నేరాల సంఖ్య చాలా రెట్లు పెరిగిందని ఆరోపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర క్షేత్రమైన తిరుమల కొండలకు కూడా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని దుయ్యబట్టారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. డ్రగ్స్ మాఫియాతో అధికార పార్టీ నేతల ప్రమేయమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు.