ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA anti group: బుజ్జగింపుల సమావేశం.. వైసీపీ కార్యకర్తల అసహనం

By

Published : Apr 28, 2023, 10:54 AM IST

Meeting with YSRCP activists against MLA: మా పనులు కావడం లేదు.. అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించేందుకు.. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రంగంలోకి దిగారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Meeting with YSRCP activists
ఎమ్మెల్యేపై ఆగ్రహంగా ఉన్న కార్యకర్తలతో సమావేశం

Meeting with YSRCP activists against MLA: గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై గుర్రుగా ఉన్న కార్యకర్తలను బుజ్జగించేందుకు స్వయంగా ఆయన అన్నయ్య రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి రంగంలోకి దిగారు. రాష్ట్రం మొత్తం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరుగుతుంటే మంగళగిరి మండలం నూతక్కిలో ఇంత వరకు ఆ కార్యక్రమం ప్రారంభమే కాలేదు.

గ్రామంలో వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అధికార పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని గత కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. అధికారంలో ఉన్నా.. గ్రామంలో ఏ ఒక్క పని జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా వాహనాలను పోలీసులు పట్టుకుంటే కనీసం వారి నుంచి విడిపించుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. వివిధ పనులపై తమ దగ్గరకి వచ్చే వారికి.. పని చేసి పెడదామంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారుల విస్తరణ పేరుతో వందల ఏళ్లుగా ఉంటున్న తమ నివాసాలను తొలగించారని.. ఇందులో ఎమ్మెల్యే హస్తం ఉందని వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ఇంతవరకు ఎందుకు ప్రారంభం కాలేదని ఎంపీ అయోధ్యరామిరెడ్డి గతంలో ఆరా తీశారు.

తాజాగా గురువారం రాత్రి నూతక్కిలో పార్టీ కార్యకర్తలతో ఎంపీ, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పార్టీ పరిశీలకులు నారాయణ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ కార్యకర్తలు.. నేతల ముందే తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూ సంబంధమైన అంశాలపై రెవెన్యూ రికార్డులో మార్పులు, చేర్పులు చేయాలని కోరినా అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడకి వెళ్లినా తమ పనులు కావడం లేదని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని కార్యకర్తలు వాపోయారు. గ్రామంలో ఇంత వరకు గృహసారథుల నియామకం మొదలు పెట్టలేదని కార్యకర్తలు నేతలకు వెల్లడించారు. గత ఎన్నికల్లో వెయ్యి ఓట్లకుపైగా మెజార్టీ వచ్చిందని.. తమను పట్టించుకోకపోతే ఇక్కడ నారా లోకేశ్​కు భారీ మెజార్టీ వస్తోందని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేక గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

నెల రోజులు సమయం ఇవ్వాలని ఈ లోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీ.. కార్యకర్తలకు చెప్పారు. మాట వినని అధికారులను పంపించేందుకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. మరోసారి అధికారులను తీసుకొచ్చి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తామని ఎంపీ, ఎమ్మెల్సీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అనంతరం అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఒక్కో కార్యకర్తతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details