అనంతపురం జిల్లాలో సాగు చేసిన ఉద్యాన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆ జిల్లా నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు చెడిపోకుండా నిల్వకాలం ఎక్కువగా ఉంటుందని దశాబ్దం క్రితమే శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విషయాన్ని ఉద్యాన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే దేశాయి ఫ్రూట్స్, ఐఎన్ఐ ఫామ్స్ కంపెనీలు గుర్తించి...గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో అరటి పండించే రైతులను ఎంపికచేసుకొని అత్యాధునిక పద్ధతిలో సాగు చేయిస్తున్నారు. ఈ కంపెనీలు తమకు అనేక విషయాలు నేర్పాయని, దీనివల్ల సాగు ఖర్చులు తగ్గించుకొని, అరటికి మంచి ధరలు పొందుతున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు.
ఆధునిక పద్ధతి...
జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. దీనిలో 16 వేల హెక్టార్లలో అరటి సాగవుతోంది. తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, శింగనమల, నార్పల, రాప్తాడు, అనంతపురం గ్రామీణ మండలాల్లో అన్నదాతలు ఎక్కువగా అరటి పండిస్తున్నారు. గతంలో వీరంతా అరటి సాగుకు ఎకరాకు లక్ష నుంచి 1.10 లక్షలు పెట్టబడి పెట్టేవారు. దేశాయి ఫ్రూట్స్, ఐఎన్ఐ ఫామ్స్ కంపెనీల శిక్షణతో ప్రస్తుతం ఎకరాకు 70 వేలు మాత్రమే ఖర్చవుతోంది. అనవసర పెట్టుబడి ఖర్చులు తగ్గించే విధానాలపై దృష్టిపెట్టే విధంగా ఆయా సంస్థలు, రైతులను తీర్చిదిద్దుతున్నాయి. పురుగు పట్టాక అరటిలో మందు పిచికారి చేసే సాంప్రదాయ పద్ధతికి బదులుగా మొగ్గకు సూది మందు ఇస్తూ పురుగు ఆశించని పద్దతిని ఆచరిస్తున్నారు. అరటి గెలకు వెదురు కర్రలను ఊతంగా పెట్టే విధానానికి కూడా రైతులు స్వస్తి చెప్పారు. గెలను తాడుతో చెట్టుకే కట్టే పద్ధతి నేర్చుకొని వెదురు కర్ర ఖర్చు తగ్గించుకున్నారు.