వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు విజృంభించే అవకాశం - డాక్టర్ పద్మావతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 12:20 PM IST
Health Director Padmavathi Suggestions on Flood Fevers : విజయవాడ వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతుల నుంచి తక్షణ చికిత్స కోసం దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. సూచనలు, సలహాల కోసం మీ స్థానిక ఎఎన్ఎంకు వెంటనే ఫోన్ చేయాలన్నారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. అలాగే కాచి, చల్లార్చి, వడపోసిన నీటిని తాగాలని తెలిపారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లు, రోళ్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలన్నారు. జ్వరాలు, వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు.