"కాంగ్రెస్ గ్యారెంటీ అంటే గోల్డెన్ గ్యారెంటీ"- మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ట్వీట్
Published : 6 hours ago
CM Revanth Reddy reacts to PM Modi :మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోదీ రైతు రుణమాఫీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ పాలనలో మొదటి సంవత్సరంలోనే విజయవంతంగా రుణమాఫీ అమలు చేయడంపై అన్ని వాస్తవాలను పంచుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ ప్రభుత్వంలో రూ. 2 లక్షలలోపు పంటరుణాన్ని వాగ్దానం చేసిన విధంగా పూర్తిగా మాఫీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ ఇదేనని, మొత్తం 22,22,067 మంది రైతులకు, రూ. 17,869.22 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ అంటే ఒక గోల్డెన్ గ్యారెంటీ అని తమ రైతులు నమ్ముతున్నారన్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ చొరవ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన నమూనాగా పనిచేస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రధానమంత్రిగా పూర్తి సహకారం, మార్గదర్శకత్వాన్ని తాను అభ్యర్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.