'తల్లీ బిడ్డల కోసం రైళ్లలో బేబీ బెర్తులు' - అశ్వినీ వైష్ణవ్
Published : Aug 3, 2024, 6:48 AM IST
Railways Experimented With Baby Berths :రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. రైలు బోగీల్లో బేబీ బెర్తులను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా? అని భాజపా ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ప్రశ్నించారు. దానికి మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ ‘‘లఖ్నవూ మెయిల్లో రెండు బేబీ బెర్త్లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం. ఒక బోగీలో రెండు దిగువ బెర్త్లకు వాటిని అమర్చాం. దీనిపై ప్రశంసలు వచ్చాయి. అయితే సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికుల బోగీల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అది నిరంతర ప్రక్రియ’’ అని వెల్లడించారు.