పూరీ జగన్నాథుని రథయాత్రకు అంతా రెడీ- 1971 తర్వాత తొలిసారి ఇలా!
Published : Jul 7, 2024, 6:39 AM IST
|Updated : Jul 7, 2024, 9:59 AM IST
Puri Jagannath Rath Yatra :విశ్వ ప్రసిద్ధమైనఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి, రథంపై వెళ్లి, తమను పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై 3 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. ఈసారి రథయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహించనున్నారు. మూడు వేడుకలు ఒకేరోజు ఉండడం వల్ల జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు నేటి సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. కనుక స్వామిసేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గం మధ్యలో నిలిపివేస్తారు. మళ్లీ సోమవారం భక్తులు రథాలను లాగుతారు. 2 రోజుల రథయాత్రలో దాదాపు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.