By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 6:15 PM IST
చోరీ చేశాక గోవాలో ఎంజాయ్మెంట్- ఐదేళ్లుగా వెతుకుతున్న అంతర్ జిల్లా దొంగలు పట్టివేత - inter district robbers in Visakha
Visakhapatnam Police Arrested Two Inter District Robbers : చోరీలకు పాల్పడుతూ ఆ సొమ్ముతో గోవాలో విలాసాలు చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వీరిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న రమేష్, రఘునందన్ పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఎక్కడా కూడా సెల్ఫోన్ ఉపయోగించకుండా తప్పించుకు తిరుగుతున్నారని వెల్లడించారు.
తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వీరు స్థానికంగానే ఉంటూ పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితులు కేవలం విశాఖ నగరంలోనే 11 చోరీలు చేశారని తెలిపారు. ఈ డబ్బుతో గోవాలో విలాసాలు చేస్తున్నట్లు గుర్తించమన్నారు. అలాగే బెట్టింగ్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు తెలిందన్నారు. అయితే రమేష్, రఘునందన్లకు జైల్లో ఏర్పడిన స్నేహబంధంతో ఉమ్మడిగా దొంగతనాలు పాల్పడుతున్నారని విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు.