ఈ నెల 11న భోగాపురం ఎయిర్పోర్టు పరిశీలనకు సీఎం చంద్రబాబు: కేంద్రమంత్రి రామ్మోహన్ - Union Minister at Inspected Airport - UNION MINISTER AT INSPECTED AIRPORT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 7:56 PM IST
Ram Mohan Naidu at Inspected Bhogapuram Airport: 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామన్న రామ్మోహన్, కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కావాలన్నా వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఈ నెల 11న సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం పర్యటన దృష్ట్యా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. భోగాపురంలో అంతర్జాతీయస్థాయి టెర్మినల్, రన్వే, ఎంఆర్వో నిర్మిస్తున్నామని, విమానాశ్రయాన్ని అన్ని వైపులా రోడ్లతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. బీచ్ హైవే ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలవారు ఇక్కడికే వస్తారని అన్నారు. ఉత్తరాంధ్రకు విమానాశ్రయ అనుసంధానం చాలా అవసరమన్న కేంద్రమంత్రి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే నెంబర్వన్ విమానాశ్రయంగా భోగాపురం ఉండాలని కోరామన్నారు. విమానాశ్రయ ప్రణాళికలోనే 2,700 ఎకరాలు ఉందని, 500 ఎకరాలు తగ్గించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. విమానాశ్రయంలో 140 విభాగాలు పనిచేస్తాయని అన్నారు.