ఉప్పొంగుతున్న వాగులతో గిరిజనుల అవస్థలు - మృతదేహం తరలింపునకు ఇబ్బందులు - TRIBALS CARRIED DEAD BODY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 11:56 AM IST
Tribals Carried The Dead Body in Stream at Alluri District : వైఎస్సార్సీపీ పాలన శంకుస్థాపనలకే పరిమితం కావడంతో ఓ గిరిజనుడి మృతదేహాన్ని స్థానికులు వరద నీటి ప్రవాహంలో తరలించిన విషాదకర సంఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల ఉద్ధృతితో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. రహదారులు సైతం సరిగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డుంబ్రిగుడ మండలం శీలంగొంది గ్రామానికి చెందిన పెదడొంబు అస్వస్థతకు గురయ్యారు. బాధితుడిని గెడ్డ దాటించి అంబులెన్సులో పాడేరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందారు.
మృతదేహాన్ని రాత్రి వేళ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలో అతి కష్టం మీద మోసుకొచ్చి గ్రామానికి తరలించారు. గత తుపానులకు చంపాపట్టి కాజ్వే కొట్టుకుపోయింది. 2021లో అప్పటి ఎమ్మెల్యే ఆర్భాటంగా శంకుస్థాపన చేసి వదిలేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఓ గర్భిణినీ సైతం గిరిజనులు భుజాలపై మోసుకొని ఆసుపత్రికి తరలించారు.