By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 12:47 PM IST
తోటి వ్యాపారి ఎదుగుదలపై దెబ్బకొట్టేందుకు యత్నం- కటకటాల పాలైన సహచరుడు
Police Seized Three And Half Kg Gold Being Smuggled: తూర్పుగోదావరి జిల్లాలో నాలుగురోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీని(Robbery) పోలీసులు ఛేదించారు. ఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డుకు చెందిన మోహన్ నారాయణ్ కుంభాకర్ గతంలో బంగారం వ్యాపారం చేసేవాడు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన బాబు నాథూరాం భీమవరంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. ఇద్దరికీ పరిచయాలు ఉన్నాయి. నాథూరాం అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారం మూతపడి బంగారు నగలు చేసుకుంటున్న మోహన్ నారాయణ్ అది జీర్ణించుకోలేకపోయాడు. నాథూరాం దగ్గర బంగారం కొట్టేయడానికి పథకం (plan) పన్నాడు.
ఈనెల 21న జంగారెడ్డిగూడెం నుంచి కారులో భీమవరానికి వెళ్తున్న నాథూరాం వద్ద భారీ మొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు తెలుసుకుని వెంటబడి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలో కుంభాకర్ అనుచరులు 12మందితో కలిసి అడ్డగించారు. ఐటీ అధికారులమంటూ బెదిరించి 3.5 కిలోల బంగారం, రూ.5 లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీలు సీహెచ్.రామరావు, కె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్లజర్ల సీఐ కె.దుర్గాప్రసాద్తో కలసి నాలుగు బృందాలుగా దర్యాప్తు చేశారు. సాంకేతిక సాయంతో నాలుగు రోజుల్లో కేసును ఛేదించి 9మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 181 గ్రాముల బంగారు గొలుసులను, మిగిలిన దాన్ని ముద్ద బంగారం రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులు అయిదుగురిపై గతంలో హత్య, చోరీ, కోట్లాట తదితర కేసులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. కేసు చేధించిన సిబ్బందిని ఎస్సీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.