చనిపోయిన వారిని పూడ్చేందుకు స్థలం చూపించండి మహ ప్రభో! - People suffering no burial ground - PEOPLE SUFFERING NO BURIAL GROUND
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 5:44 PM IST
People Suffering due to Lack of Space Burial Ground : మనిషి జీవితంలో ఎంత కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నా, ఎన్ని కష్టాలను అనుభవించినా చివరికి వెళ్లేది ఆరు అడుగుల గొయ్యిలోకే. చనిపోయిన మనిషిని ఆ గొయ్యిలో పూడ్చేందుకు సైతం సరైన శ్మశానం లేక శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, కొత్తచెరువు మండల కేంద్రంలోని స్థానికులు వారి పూర్వీకుల నుంచి చనిపోయిన వారిని బుక్కపట్నం చెరువులోనే పూడ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా భారీ వర్షాలతో హంద్రీనీవ కాలువ నీరు దిగువకు వదలడంతో చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో మరణించిన వారికి అంత్యక్రియలు చేసేందుకు స్థలం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, తరతరాలుగా మరణించిన వారి అంత్యక్రియలను బుక్కపట్నం చెరువులోనే చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా హంద్రీనీవ కాలువ ద్వారా చెరువులోకి నీరు వదలడంతో పూర్తిగా నిండి పోయిందని వాపోయారు. దీంతో మరణించిన వారిని ఎక్కడ పూడ్చిపెట్టాలో అర్ధం కావటం లేదని మండిపడ్డారు. ఈ సమస్యపై ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు స్పందించి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.