అసంతృప్త ఎంపీలతో ఎంపీ మాగుంట భేటీ - భవిష్యత్ కార్యాచరణపై చర్చ - ఒంగోలు ఎంపీ మాగుంట
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 4:11 PM IST
MP Magunta Meeting with Followers : రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. పొరుగు జిల్లాల్లోని అసంతృప్త ఎంపీలతో ఒంగోలు ఎంపీ మాగుంట భేటీ అయినట్లు తెలిసింది. హైదరాబాద్లో మంతనాలు సాగించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి భవిష్యత్ కార్యాచరణపై నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యేతో కలిసి చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో వైఎస్సార్సీపీ అధిష్ఠానం నుంచి గెంటివేతకు గురైన ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఇటీవల దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ సహా అమిత్షాను కలిసిన సీఎం జగన్ పార్లమెంట్ ఆవరణలో తనను పలకరించిన మాగుంట వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఎంపీ నమస్కరించినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధిష్ఠానం నుంచి అవమానాలు ఎదుర్కొంటున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పొరుగు జిల్లాల్లోని అసంతృప్త ఎంపీలతో మంగళవారం హైదరాబాద్లో మంతనాలు సాగించారు. వైసీపీ అధిష్ఠానం నుంచి గెంటివేతకు గురైన ఉమ్మడి జిల్లాల్లోని ఓ ఎమ్మెల్యే కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.