Cows Theft in Talamarla : కనిపెంచిన బిడ్డలు దూరం అవుతారేమో గాని, తమతో కష్టం పంచుకునే పశువులను మాత్రం రైతులు దూరం చేసుకోరంటే అతిశయోక్తి కాదు. వాటిని తమ సొంత కన్నబిడ్డలుగా ఆలనా పాలన చూసుకుంటారు. వాటికి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తితే యజమానులు అల్లాడిపోతారు. అలాంటి పశువులు కనిపించకుండా పోతే వారి గుండె పగిలిపోతుంది. అవి ఎక్కడికి పోయాయని కంగారు పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ రైతు ఉదయాన్నే లేచేసరికి రోజు పాలిచ్చే ఆవులను దుండగులు చోరీ చేశారు. దీంతో కన్నీటిపర్యంతమైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయని పోలీసులు వాటిని ఎవరు దొంగతనం చేశారో గుర్తించాలని సలహా ఇచ్చారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆ రైతు తానే ఓ పోలీస్గా అవతారం ఎత్తాడు. ఐదు రోజుల పాటు గాలించి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆవులను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే కొత్తచెరువు మండలం తలమర్లకు చెందిన ఫణీంద్రరెడ్డికి వ్యవసాయంతోపాటు పాడిపోషణే జీవనాధారం. రెండు పాడి ఆవులతో నెలకు రూ.20,000ల ఆదాయం సమకూరుతోంది. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే ఇండ్లవెంకటాంపల్లి దారిలోని పొలంలో ఉన్న షెడ్డులో ఆవులకు మేతవేసి ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆయన పాలు పితకడానికి వెళ్లగా షెడ్డులో రెండు ఆవులు, దూడ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆందోళన చెందిన ఫణీంద్రరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయని పోలీసులు ఆవులు ఎవరు చోరీ చేశారో గుర్తించాలని సలహా ఇచ్చారు.
దీంతో జీవనాధారమైన ఆవుల ఆచూకీ కోసం ఫణీంద్రరెడ్డి పోలీస్గా మారారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించి ఆవులను తరలించిన వాహనాన్ని నిర్ధారించారు. మండల కేంద్రంలోని వాహన డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని విచారించారు. స్థానికంగా పశువుల వ్యాపారం చేస్తున్న సోమిరెడ్డి అనేవ్యక్తి ఆవులు తనవిగా చెప్పాడని డ్రైవర్ తెలిపాడు. వాటిని చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు తరలించి విక్రయించినట్లు పేర్కొన్నాడు. దీంతో ఆయన అతన్ని వెంటబెట్టుకుని 160 కిలోమీటర్ల దూరంలోని పుంగనూరుకు చేరుకున్నారు. రూ.2.50 లక్షలు విలువజేసే వాటిని స్థానికంగా ఒక వ్యాపారికి రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు.
Kothacheruvu Cows Theft Incident : సీసీ కెమెరా దృశ్యాలతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో భయపడిన వ్యాపారి సోమిరెడ్డి ఆవులను ఫణీంద్రరెడ్డికి అప్పగించారు. దీంతో ఐదు రోజుల కిందట చోరీకి గురైన ఆవులతో ఆయన శనివారం స్వగ్రామానికి చేరుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. దీనిపై యూపీఎస్ సీఐ ఇందిరను వివరణ కోరగా చోరీ ఘటన తెలిసిందని చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.