ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారడం లేదు : ఎమ్మెల్యే రోహిత్ రావు - Medak District
Published : Jan 28, 2024, 9:13 PM IST
MLA Mynampally Rohithrao Fires on BRS : ప్రజలు ఓడించినప్పటికీ మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుద్ధి మారడం లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మండిపడ్డారు. ఇవాళ ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ మండలంలోని మాందాపూర్, గవ్వలపల్లి, రుద్రారంలలో గ్రామ పంచాయతీల భవన ప్రారంభోత్సవంతో పాటు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలో రాధా స్టీల్ పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ ప్రారంభించారు.
మాజీ మంత్రి హరీశ్రావుకు మెదక్ జిల్లాలో పని ఏంటి అని ఎమ్మెల్యే రోహిత్రావు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డి, అధికారం కోల్పోయాక మెదక్లోనే ఉంటూ, హరీశ్రావుతో కలిసి అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గొడవలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అబద్ధపు ప్రచారాలతో, మాయ మాటలతో, ప్రజలను మోసం చేసి అవినీతికి పాల్పడిన హరీశ్రావు బాగోతాన్ని బయటపట్టేందుకు సిద్దిపేటకు తానే వస్తానని రోహిత్రావు హెచ్చరించారు. ప్రజల అడుగులో అడుగునై, కుటుంబసభ్యుడిలా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకు సిద్ధమన్నారు.