Published : Feb 10, 2024, 12:35 PM IST
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం దేవాదుల కాలువ రైతులకు శాపంగా మారింది : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA Kadiyam Visit To Devadula Canal : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు ఉన్న వివిధ గ్రామాల నుంచి వెళ్లే ప్రధాన కాలువ తానేదారుపల్లి, బోయినిగూడెం, కోమటిగూడెం, కంచనపెళ్లి, శ్రీమన్నారాయణపురం, నవాబ్పేట గ్రామాలకు వెళ్లే ఉప కాల్వలను దేవాదుల అధికారులతో కలిసి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. ఘనపూర్ రిజర్వాయర్ నుంచి నవాబు పేట రిజర్వాయర్ వరకు వెళ్లే ప్రధానమైన కాలువ పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని కడియం తెలిపారు. ఈ ప్రధాన కాలువకు సంబంధించిన పిల్ల కాలువలు కూడా ధ్వంసం అయ్యాయని, కనీస నిర్వహణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
Kadiyam Srihari In Station Ghanpur Reservoir : కాలువలకు ఎక్కడ షటర్లు పెట్టలేదని, కాలువలలో విపరీతమైన తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలతో, చెత్తా చెదారంతో కాలువలు ఎక్కడికక్కడ కూరుకొని పోవడంతో నీళ్లు కిందికి పోయే పరిస్థితి లేదని కడియం మండి పడ్డారు. అధికారులు తక్షణం చెట్లను తొలగించి, పూటిక మట్టిని తీసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వాయర్ కట్టలకు ఉన్న చెట్లను తొలగించి పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల దేవాదుల కాలువ రైతులకు శాపంగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.