By ETV Bharat Andhra Pradesh Team
Published : 6 hours ago
అక్రమ నిర్మాణాలపై ఫోకస్ - ఎంతటివారైనా ఉపేక్షించం: మంత్రి నారాయణ - Narayana on Operation Budameru
Minister Narayana on Operation Budameru: బుడమేరు ఆక్రమణల వల్లే విజయవాడకు భారీ వరద వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. ఆక్రమణలు చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పేదల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తరలింపులు ఉంటాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తామన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి నారాయణ పర్యటించారు. బుధవారం సీఎం చంద్రబాబు 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం అమృత్ పథకానికి మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకపోవడంతో మంచినీటి కుళాయి కనెక్షన్లు నిలిచిపోయాయన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా ఇంటింటికీ రక్షిత నీరు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు.