By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 6:58 AM IST
రైతుబజార్లలో 160కే కిలో కందిపప్పు: మంత్రి నాదెండ్ల - Minister Nadendla Manohar
Minister Nadendla Manohar Review on Price Stabilization : ఏపీలోని అన్ని రైతు బజార్లలో కందిపప్పు కిలో 160 రూపాయల చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్టీమ్డ్ రైస్ 49 రూపాయలు, ముడి బియ్యం 48 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించారు. విజయవాడలోని పౌరసరఫరాల కమిషనరేట్లో టోకు వర్తకులు, రైసు మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు.
రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై సరఫరాదారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు పాల్పడవద్దని వ్యాపారులకు మంత్రి సూచించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కందిపప్పు 181, స్టీమ్డ్ రైస్ 55.85, ముడి బియ్యం 52.40 రూపాయలకు అమ్ముతున్నారు. నిత్యావసర ధరలైన వీటిపై ధరలు తగ్గించడంతో సామాన్యులకు కొంత వరకు ఊరట కలుగుతుంది.