జగన్ పాలనలో ఆక్వారంగం సర్వనాశనం -ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం : కామినేని - Kamineni fire on Nageswara Rao - KAMINENI FIRE ON NAGESWARA RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 3:56 PM IST
Kamineni Srinivasa Rao Fire on YSRCP Government : గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఏ అవినీతి ఆరోపణలూ లేవు. మాటిస్తే అందుకు కట్టుబడి ఉంటారని అక్కడి ప్రజలంతా ఆయన గురించి చెప్పుకొంటుంటారు. ఆయనే రాజకీయాల్లో అజాతశత్రువులా చెప్పుకునే కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, కైకలూరు నియోజకవర్గం నుంచి రోజుకు దాదాపు 300 లారీల ఇసుక అక్రమంగా బయటికి వెళ్తుందని తెలిపారు. ప్రధానంగా కైకలూరిలో ఎక్కడ చూసిన తాగునీటి సమస్య ఉందని కామినేని వెల్లడించారు.
'ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నా ఇక్కడి నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో అక్వారంగం సర్వనాశనం అయ్యింది. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి ఆ పరిశ్రమలను అప్పుల పాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నింటికి స్వస్తి చెపుతాం. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు గడిచినా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు' అని కామినేని శ్రీనివాసరావు విమర్శించారు.