By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 1:00 PM IST
చేపల సంతానోత్పత్తి సమయం- రెండు నెలల పాటు సముద్రంలో వేటపై నిషేధం - Fishing ban in ap
Fishing Ban Period Start from Today for 61 Days in AP: ఈరోజు నుంచి రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం అమలుకానుంది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్, లంకేవాని దిబ్బ, నక్షత్ర నగర్, కొత్తపాలెం జెట్టిల బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి. ఈ రెండు నెలలు సముద్ర జీవాల సంతానోత్పత్తి కాలం అవ్వడంతో మత్స్య ఉత్పత్తుల సంరక్షించేందుకు ప్రభుత్వం వేట నిషేధిస్తోంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 తేదీ వరకూ మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్ల ద్వారా చేపట్టే అన్ని రకాల చేపల వేటను నిషేధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. నిషేధిత కాలంలో వేట జరగకుండా అమలు చేసేలా మత్స్యశాఖ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. 61 రోజుల పాటు చేపల వేట నిలిపివేయటం వల్ల సముద్ర జలాల్లో చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి జరుగుతుందని తద్వారా వాటి సంతతి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. దీంతో మత్స్య సంపద అధికమయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సుస్థిరత సాధించేందుకే వేట నిషేధిస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి సముద్ర తీరప్రాంతాల్లో చేపల వేటకు వెళ్తే సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994ను అనుసరించి బోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని గతంలో అధికారులు స్పష్టం చేశారు.