డయేరియా బాధితులను పరామర్శించిన హెల్త్ డైరెక్టర్ - AP HEALTH DIRECTOR ON DIARRHEA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 5:39 PM IST
Health Department Director Padmavathi Visit in Hospital: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి పరిశీలించారు. కేసులు పెరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి సూచనలు చేశారు. జగ్గయ్యపేట సహా చుట్టు పక్కల గ్రామాల్లో బాధితులు ఎంతమంది ఉన్నారు అక్కడి స్థానిక సంస్థల కార్యచరణను ఆమె అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని రోగులకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారని వెల్లడించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40 మంది డయేరియా బాధితుల్లో ఇంకా 22 మంది చికిత్స పొందుతున్నారని పద్మావతి వెల్లడించారు. అనంతరం డయేరియా కేసుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన చికిత్స అందించాలన్నారు. వైద్యులు గంటకు ఒకసారి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారని పద్మావతి తెలిపారు. నియోజకవర్గంలో డయేరియా కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమై పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.