By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 4:31 PM IST
స్వచ్ఛాంధ్రపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష - పారిశుద్ధ్య సమస్యలను నివారించాలని ఆదేశం - Pawan Review on Swachhandhra
Deputy CM Pawan Kalyan Review on Swachhandhra Corporation Activities : గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా నివారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆయన సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, చెత్త తరలింపు, పచ్చదనం పెంపు కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఐదేళ్లలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల వినియోగంపై ఆరా తీశారు. స్వచ్ఛభారత్ కింద కేంద్రం ఇచ్చే నిధుల దారి మళ్లింపుపై ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. నిధులు సక్రమంగా వినియోగించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అలానే గ్రామాల్లో విస్తరిస్తున్న డయేరియాను నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ను కలిసేందుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.