నంద్యాలలో సీసీ కెమెరాకు చిక్కిన మరో చిరుత- తీవ్ర భయాందోళనలో స్థానికులు - Leopard at Mahanandi temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 7:38 PM IST
CCTV Footage of Leopard Straying at Mahanandi Temple : నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి గోశాల వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మహానందిలో సంచరిస్తున్న చిరుతను అటవీ అధికారులు పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇటీవల నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచ్చర్ల అటవీవ ప్రాంతంలో ఓ చిరుత సంచరించింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మెహరున్నీషా అనే మహిళపై చిరుత దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అంతకంటే ముందు ఇదే చిరుత దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. గ్రామస్థుల ఫిర్యాదుతో గ్రామ సమీపాన అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి వచ్చి చిరుత బంధించబడింది. బంధించిన చిరుతను తిరుపతి జంతు ప్రదర్శనశాలకు ప్రత్యేక వాహనంలో అధికారులు తరలించారు. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మరో చిరుత మహానందిలో సంచరిస్తుడటంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.