పేదలను మోసం చేస్తున్న ప్రభుత్వం మాకొద్దు - రాజధాని ప్రాంత మహిళల వినూత్న నిరసన - capital region womens protest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 5:41 PM IST
Capital Region Women Angry With Jagan Government : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంత మహిళల వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద చేతులకు సంకెళ్లు వేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని ప్రాంతంలో ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేనట్లు చెప్పారు. అక్కాచెల్లెళ్లకు అన్ని పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ రాజధానిలో మహిళలను వేధిస్తున్నారనే విషయాన్ని ఈ రోజైనా గుర్తుకు తెచ్చుకోవాలని సీఎం జగన్కు హితవు పలికారు.
పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సంక్షేమ పథకాల పేరిట పేదలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మాకొద్దు అని స్పష్టం చేశారు. మహిళలపైన ఉక్కుపాదం మోపుతున్న ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మహిళలను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. అక్కాచెల్లెమ్మలని నీతులు చెప్పే ముఖ్యమంత్రి ఇదేనా మీరు చేసే న్యాయమని ప్రశ్నించారు? జగన్ 5 సంవత్సరాల పాలనలో మహిళలకు లాఠీ దెబ్బలు, అవమానాలు , కేసులు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.