పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడిపై దాడి -ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిక - Vallabhaneni Vamsi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 7:03 PM IST
Attack on TDP Leader in Gannavaram: రాష్ట్రంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పెరుగుతుండటంతో అధికార పార్టీ నేతలు దాడులకు తెరలేపారు. పార్టీ మారిన వారిని టార్గెట్గా చేసి తీవ్రంగా వేధిస్తున్నారు. దాడులకు సైతం తెగబడుతున్నారు. అయినా సరే అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నేతలు, కార్యకర్తలు వైసీపీని వీడుతున్నారు. తాజాగా గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో పీఏసీఎస్ (Primary Agricultural Cooperative Societies) మాజీ అధ్యక్షుడు కాసన్నేని రంగబాబుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హైవే ఆనుకొని ఉన్న పార్క్ ఎలైట్ హోటల్ వద్ద పొలం విషయమై రంగబాబును పిలిచి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రంగబాబు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రంగబాబుపై దాడికి పాల్పడింది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులని టీడీపీ నేతలు ఆరోపించారు. రంగబాబు కాలుకు గాయమవ్వడంతో అతనిని స్థానికులు పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు.