YSRCP Irregularities in Sand Tenders : రాష్ట్రంలో జగన్ సర్కార్ ఇసుక దందా పేరిట రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ఇతరులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందస్తు వ్యూహాన్ని పన్నింది. కేవలం తాము అనుకున్న బినామీ కంపెనీలు మాత్రమే బిడ్లలో పాల్గొనేలా చేసి, అందులో ఒకటి టెండరు దక్కించుకున్నట్లు చూపించి దానిపేరిట ఈ దందాను చేశారు. ఇందుకు టెండరు నిబంధనల రూపకల్పన సమయంలోనే బీజం పడింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు చెప్పినట్లుగానే అప్పటి గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి ఇసుక టెండర్లలో పలు షరతులు విధించి ఇతరులెవరూ పోటీకి రాకుండా చేశారు.
అత్యధికంగా 8 శాతం ధరావతు : టెండరు పిలిచినప్పుడు ఏ ప్రభుత్వశాఖ అయినా దాని అంచనా విలువలో ఒక శాతం ధరావతుగా చెల్లించాలని నిబంధన పెడుతుంది. బిడ్ దక్కించుకున్న వాళ్లు పెర్ఫార్మెన్స్ గ్యారంటీ కింద కూడా ఒక శాతం బ్యాంక్ హామీని ఇవ్వాల్సి ఉంటుందనే షరతు విధిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ సర్కార్లో ముఖ్యమంత్రి జగన్ ఇసుక సొమ్మును అడ్డగోలుగా దోచుకునేందుకు టెండరు నిబంధనలు తమకు అనుకూలంగా మార్చారు.
ఇందులో భాగంగా 2021 ఆరంభంలో ఇసుక టెండర్లు పిలిచారు. ధరావతుగా 8 శాతం చెల్లించాలని, బిడ్ దక్కితే పెర్ఫార్మెన్స్ హామీగా కూడా 8 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని షరతులు పెట్టారు. ఏపీ వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో కలిపి రెండు సంవత్సరాల్లో ఇసుక విక్రయాల ద్వారా రూ.1,500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. ఇందులో 8 శాతం అంటే రూ.120 కోట్లు ధరావతుగా చెల్లించాలని నిబంధన విధించారు. అదేవిధంగా బిడ్ దక్కించుకున్న గుత్తేదారుకి చెందిన ధరావతుని పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా పరిగణనలోకి తీసుకుంటామని అందులో తెలిపారు.
కానీ ఇంత భారీ మొత్తం ధరావతుగా, ఫెర్ఫార్మెన్స్ గ్యారంటీగా చెల్లించేందుకు ఏ ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు ఆసక్తి చూపలేదు. కేవలం ఉత్తరాదికి చెందిన నాలుగు సంస్థలతోనే బిడ్లు వేయించారు. ఇందులో జయ్ప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్(జేపీ) రూ.1,528 కోట్లు చెల్లిస్తానని కోట్చేయగా, ఆ సంస్థకే బిడ్లు కట్టబెట్టారు. తర్వాత టర్న్కీ ఎంటర్ప్రైజెస్ను ఉప గుత్తేదారుగా రంగంలోకి దించి, ఇసుక సొమ్మంతా వైఎస్సార్సీపీ ముఖ్య నాయుకులు దోచుకున్నారు.
జీసీకేసీ, ప్రతిమా కూడా ఇంతే : జేపీ సంస్థతో 2023 మేతో ఇసుక ఒప్పంద గడువు ముగిసినా నవంబర్ వరకు దాన్నే కొనసాగించారు. మళ్లీ గుత్తేదారుల ఎంపికకు టెండర్లు పిలిచారు. అప్పుడు కూడా 8 శాతం ధరావతు, పెర్ఫార్మెన్స్ గ్యారంటీ షరతు పెట్టారు. ఇందులో భాగంగా ఇతరులను రానివ్వకుండా చేసి రాజస్థాన్కు చెందిన జీసీకేసీకి ఒక ప్యాకేజీ, తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్ఫ్రా సంస్థకు రెండు ప్యాకేజీలు కట్టబెట్టారు. ఈ రెండు సంస్థలను ముఖ్య నాయకుడి సోదరుడే తీసుకొచ్చి టెండర్లు ఇప్పించారు. ఇప్పటివరకు తెరవెనకు ఆయనే ఉండి ఈ ఇసుక దందాను సాగించారు.