YSRCP Government Neglect Silk Industry in West Godavari :ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో పట్టు పరిశ్రమ వ్యవసానుబంధ కుటీర పరిశ్రమగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా ఉపాధి కల్పించే భాండాగారంగా ఈ పరిశ్రమకు పేరుండేది. గిరిజనులు పట్టణాలకు వలస పోకుండా ఎంతగానో ఉపయోగపడేది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు నూతన పద్ధతుల్లో షెడ్లు నిర్మించి, మల్బరీ మొక్కలు పెంచి రైతులు పట్టు సాగు చేసేవారు. ఉమ్మడి జిల్లాలోని భీమడోలు, జీలుగుమిల్లి, కామవరపుకోట, బుట్టాయగూడెం ప్రాంతాల్లో సాంకేతిక సేవా కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. ఒక రైతు పట్టు సాగు చేస్తే సుమారు 10 మందికి ఉపాధి లభించేది. జగన్ ప్రభుత్వంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు, రాయితీలు రాకపోవడంతో పరిశ్రమ దివాలా తీసింది.
రాయితీలు, ప్రోత్సాహకాలకు గండి :2018 వరకూ అప్పటి ప్రభుత్వం ఎకరం మల్బరీ మొక్కల సాగుకు మూడేళ్ల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు అందించగా రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. అలాగే ప్రతి కిలో పట్టు పురుగులకు 50 రూపాయల ప్రోత్సాహక రాయితీ వర్తించేది. వీటితో పాటు పట్టుగూళ్లు కొనుగోలు చేసేందుకు కృష్ణా జిల్లా హనుమాను జంక్షన్ వద్ద పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు.