Youth Voting in Andhra Pradesh Elections: మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలకు ఉపాధి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. వీరంతా సోమవారం సొంత ఖర్చులతో 42 బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ వచ్చారు. మలికిపురంలో బస్సులు ఆపి అక్కడి నుంచి వ్యక్తిగత వాహనాల్లో సొంత గ్రామాలకు వెళ్లి ఓటేశారు. ఇందులో ఎక్కువ మంది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతే ఉండటం గమనార్హం.
కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదైంది. వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఎన్నికల సమరంలో కీలకమైన పోలింగ్ ఘట్టంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్ర భవితను నిర్ణయించేందుకు జనం పోటెత్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో తొలుత మందకొడిగా సాగిన ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది. మధ్యాహ్నం ఎండను సైతం లెక్కచేయకుండా ఓటరు మహాశయులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు సైతం కుటుంబసభ్యుల సాయంతో ఓటేసేందుకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా అనేక చోట్ల కేంద్రాలు కిటకిటలాడాయి. రాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024