Wind Rain Disaster in Manyam And Anakapalli Districts: నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచంపేటలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. మన్యం జిల్లా సాలూరులో గాలి- వాన తాకిడికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డు పక్కనున్న వస్తువులు, తోపుడు బండ్లు సైతం విపరీతమైన గాలులకి కొట్టుకుపోయే విధంగా మారడంతో ప్రజలు హడలిపోయారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. గొలుగొండ సమీప పొలాల్లోని చెట్లపై పిడుగు పడడంతో రైతులు, కూలీలు భయాందోళన చెందారు.