ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాగల 36 గంటల్లో భారీ వర్షం - తిరుమలలో ఆ దర్శనాలు రద్దు - టీటీడీ బోర్డు నిర్ణయం

విపత్తుల నివారణపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

TTD on Heavy Rains in AP
TTD on Heavy Rains in AP (ETV Bharat)

TTD on Heavy Rains in AP : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే విపత్తుల నివారణపై టీటీడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.

విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి ఈవో శ్యామలరావు వర్చువల్ విధానంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాగల 36 గంటల్లో భారీ వర్ష సూచనపై సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని భేటీలో నిర్ణయించారు. 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని, అలాగే భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఈవో శ్యామలరావు సూచనలు చేశారు.

Heavy Rain in Tirumala : 2021లో భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రణాళిక మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులకు వివరించారు. ఈవో స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈవో ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు శ్యామలరావు ఆదేశాలిచ్చారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు వివరించారు. విద్యుత్‌ సరఫరా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే జనరేటర్లు నడపడానికి ముందస్తు జాగ్రత్తగా తగినంత డీజిల్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఐటీ విభాగం వారు భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాల తయారీ కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈవో ఆదేశించారు.

విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇంజనీరింగ్ విభాగం వారు డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలి. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వేగంగా స్పందించేందుకు ఫైర్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎస్వీబీసీ, మీడియా, టీటీడీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలి’’ అని అధికారులను ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర విభాగాధిపతులు, జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

4 రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

అల్పపీడనం ఎఫెక్ట్ - పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details