IPS Officers Suspended in Kadambari Jethwani Case: ముంబై నటి అక్రమ నిర్భందం, బెదిరింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592ను ప్రభుత్వం విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్సైట్ పేర్కొంది. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్లపై వేటు పడింది. ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను డీజీపీ సస్పెండ్ చేశారు. మరికొందరు పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
ముంబయి సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సీపీ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో ఓ సిట్ను ఏర్పాటు చేశారు. ముంబయి నటి, ఆమె తల్లిదండ్రులు, మరికొందరిని సిట్ విచారించింది. వారినుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై ప్రాథమిక నివేదికను తయారు చేసి డీజీపికి అందించారు. డీజీపీ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా ఈ దర్యాప్తును పర్యవేక్షించిన అధికారిగా విఫలమైనట్టు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఈ కేసు దర్యాప్తును అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా తేలింది. ఎఫ్ఐఆర్ 2.2.2024న నమోదైతే 31.1.2024 న సీతారామాంజనేయులు అప్పటి విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ తదితర దర్యాప్తు బృందాన్ని సీఎంఓకు పిలిచి, సినీ నటీ జెత్వానీని అరెస్టు చేయమని ఆదేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.