తెలంగాణ

telangana

ETV Bharat / state

11వ శతాబ్ధపు అద్భుతం ఈ ఆలయం - ఇక్కడ అన్నీ వింతలూ, విశేషాలే? - STORY ON 11TH CENTURY OLD TEMPLE

పర్యాటకులను ఆకర్షిస్తున్న 11వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యులు నిర్మించిన దేవస్థానం - 16 కోణాలతో నక్షత్ర ఆకారంలో ఉండటం ఆలయం ప్రత్యేకత - సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడటం ఇక్కడి అద్భుతం

Story On 11th Century Chalukya Temple
Story On 11th Century Chalukya Temple (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 9:42 PM IST

Story On 11th Century Chalukya Temple : రాజులు పోయారు రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం చిరస్థాయిగా కొన్ని తరాల పాటు సజీవంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం స్టోరీ. ఆ దేవస్థానాన్ని 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేవస్థానం మెుత్తం 16 కోణాలతో నక్షత్ర ఆకారంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత.

ఆలయ ముఖద్వారమైన మాలతోరణానికి ఉన్న ఆరు రంద్రాల నుంచి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న రామలింగంపై పడటం అద్భుత ఘట్టం. రామలింగేశ్వరునికి కావలిగా నందీశ్వరుడు ఉన్నాడని భక్తుల విశ్వాసం. పూర్వం "కిరియ కంది" గా పిలువబడే ఈ గ్రామం నందీశ్వరుడు కొలువుదీరడంతో నంది కంది అని పేరును మార్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

నక్షత్ర ఆకారపు దేవాలయం :సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని నందికంది గ్రామంలో 11వ శతాబ్దంలో ఆనాటి కల్యాణి చాళుక్యులు నిర్మించిన నక్షత్ర ఆకారపు దేవస్థానం నేటికీ చెక్కు చెదరలేదు. ఇక్కడ అడుగడుగునా ఆధ్యాత్మికంతోపాటు సైన్స్‌కూడా తారసపడుతోంది. దేవస్థానం ముఖద్వారానికి ఆరు రంద్రాలతో మూలతోరణాన్ని నిర్మించారు. దీని ద్వారా గర్భగుడిలో ఉన్న లింగంపై నేరుగా సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆనాటి కట్టడాలతో కూడిన రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఇక్కడ బసవన్న రంకె వేసాడంట :దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో కొలిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ బసవన్నతోపాటు వివిధ ప్రాంతాల్లో చాళుక్యులు శాసనాలను వేయించారు. ఔరంగజేబు కాలంలో దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి కొందరు యత్నించగా ఆలయం ముందు ఉన్న బసవన్న పెద్దగా రంకె వేయడంతో దుండగులు గర్భగుడిలోకి వెళ్లకుండా పారిపోయినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి "కిరియ కంది"గా ఉన్న గ్రామాన్ని 'నంది కంది'గా నామకరణం చేసుకున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

ప్రతి ఏడాది వార్షికోత్సవాలు :కార్తిక పౌర్ణమి, శివరాత్రి వంటి పండుగల వేళ స్వామివారికి ప్రత్యేక పూజలు సహా ప్రతియేటా వార్షికోత్సవాలు జరుపుతున్నారు. దేవస్థానంలోని శిల్ప కళలు, అద్భుత కట్టడాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడ గీతా పారాయణం చేసుకోవడం ఓ అద్భుత అవకాశంగా భక్తులు భావిస్తున్నారు. గ్రామం పేరు కూడా ఆనాటి ఆనవాళ్లకు అనుగుణంగా మార్చుకోవడం అనేది గ్రామస్థుల్లో ఉన్న విశ్వాసానికి ప్రతీక నిలుస్తోంది.

సెలబ్రిటీల ఆరాధ్యదైవం - లక్షలాది భక్తుల దర్శనం కోట్లలో ఆదాయం- ఎక్కడంటే? - Mumbai Siddhivinayak Temple

ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే శివాలయం - దర్శనానికి క్యూ కట్టిన భక్తజనం - మన తెలంగాణలోనే

ABOUT THE AUTHOR

...view details