Telangana State Govt Planning To HYDRA Expansion : తెలంగాణలో సంచలనంగా మారిన హైడ్రాను, మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. జులై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు ఓఆర్ఆర్ లోపు ఉన్న పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొంది. సమయానుకూలంగా ఆ పరిధిని పెంచుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
హైడ్రా పరిధిని మరో 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించాలని కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. చెరువులను పరిరక్షణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించడంతో, హైడ్రాను మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా సీఎం రేవంత్రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చర్చించినట్లు సమాచారం.
జీవో 111లోని ప్రాంతాలను హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావన : ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపు ఉన్న చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమిత కట్టడాలనే హైడ్రా కూల్చి వేస్తోంది. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కూడా ముఖ్యమని గుర్తించింది. ఇటీవల గండిపేటలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద ఆక్రమిత కట్టడాలను నేలమట్టం చేసింది. ఐతే జీవో 111లోని ప్రాంతాలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జీవో 111 పరిధిలో 84 గ్రామాలుండగా గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను రద్దు చేశారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో, చాలా మంది రియల్టర్లు, అక్రమార్కులు యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు.
మొయినాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ల పేరుతో కాలువలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాల వల్ల జంట జలాశయాల ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందున్న పర్యావరణ నిపుణుల అభిప్రాయాలతో ఏకీభవించిన హైడ్రా, చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించింది. శంషాబాద్, ఘట్కేసర్, పటాన్ చెరువు అవతల వైపు కూడా పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు నామరూపాల్లేకుండా పోయాయి. ఓఆర్ఆర్ అవతల కూడా తమ బుల్డోజర్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా పరిధి విస్తరణపై ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.