Govt Focus On Dharani Pending Issues :ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల కోసం సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు. ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్లు భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సీసీఎల్ఏ ఇచ్చిన సర్క్యులర్కు లోబడి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ స్థాయిలో మ్యూటేషన్, పట్టాదార్ పాస్ బుక్స్, నాలా కన్వర్షన్, పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణలు తదితరాలు ఉన్నట్లు వివరించారు. అందులో పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్చేటప్పుడు కచ్చితంగా మార్గదర్శకాలను అనుసరించాలన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ఇలా :తహసీల్దార్ దరఖాస్తులను పరిశీలన చేసి ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మార్యో దగ్గర నుంచి వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అదనపు కలెక్టర్కు ఆర్డీవో అప్లోడ్ చేయాలని సూచించారు. తహసీల్దార్, ఆర్డీవోల పరిశీలన తరువాత తనకు వచ్చిన ధరఖాస్తులను సంపూర్ణంగా పరిశీలించి ఆమోదం తెలియచేయడంకాని, తిరస్కరించడం కానీ చేయాలని స్పష్టం చేశారు.