రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మాష్టమి వేడుకలు- శ్రీకృష్ణ నామస్మరణతో హోరెత్తుతున్న ఆలయాలు (ETV Bharat) Sri Krishna Janmashtami Celebrations Across The AP :శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నందగోపాలుడి దర్శనం కోసం ఆలయంలో భక్తులు బారులు తీరారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయాలు హోరెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రజలకు ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.
అన్ని విషయాల్లో మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చన్నారు. చిన్ని కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దైవమై రక్షిస్తూ, గురువులా నేర్పిస్తూ, స్నేహితుడై వెన్నంటి నిలుస్తున్న నందగోపాలుని ఆశీస్సులతో ప్రజలంతా ఆనందంగా జీవించాలని ప్రార్థించారు.
కృష్ణాష్టమి స్పెషల్- కిట్టయ్య లీలల వెనుక అసలు సంగతేంటో తెలుసా? - Sri Krishna Ashtami 2024
ఏలూరు జిల్లా అగిరిపల్లిలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. కళాల ప్రోత్సాహకానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం తరఫున రాజకీయాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు. చిన్నారులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహ ఊరేగింపులో మంత్రి సవిత రథాన్ని లాగారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం, ముమ్మిడివరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పి.గన్నవరంలో శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తిని ఎడ్లబండిపై ఊరేగించారు. గోదావరి జలాలతో మహిళా భక్తులు కన్నయ్యకు జలాభిషేకం చేశారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని నందగోపాలుడిని ఆరాధించారు. ముమ్మిడివరంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో చిన్నారుల కృష్ణ, గోపికల అలంకరణలు, నృత్యాలు అలరించాయి.
మోక్షం ప్రసాదించే 'శ్రీ కృష్ణాష్టమి పూజ'- ఈ విధంగా చేస్తే సకల పాపాలు దూరం! - Krishna Janmashtami 2024
విశాఖపట్నంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నందగోపాలుడి దర్శనం కోసం ఆలయంలో భక్తులు బారులు తీరారు. కన్నయ్యను ఊయలలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తి ఆరాధనతో ఆలయ ప్రాంగణం పులకరించింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మునిరెడ్డి కాంప్లెక్స్ ఆవరణలో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకులు జరిగాయి. శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. నారాపుర ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉట్టి కొట్టారు.
నెల్లూరు జిల్లాలో కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్, కృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలపేట శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జనసేన నేత నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో ఆమని గార్డెన్స్ వద్ద కృష్ణుని విగ్రహం ప్రతిష్టించి, విశేష పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కర్నూల్ బెటాలియన్ కమాండర్ రమేశ్, నైన్ ఆంధ్రా బెటాలియన్ కమాండర్ ఫిలిప్ పాల్గొన్నారు.
పెన్సిల్పై బాలకృష్ణుడు- సూక్ష్మకళాకారుడి అద్భుత ప్రతిభ - Lord Krishna Idol on Pencil Lead