తెలంగాణ

telangana

ETV Bharat / state

'టీచరమ్మా - నువ్వు సూపరమ్మా' - ప్రభుత్వ బడికి ప్రాణం పోసి - 83 మంది భవితకు బాటలు వేసి - Govt Teacher Inspirational Story

Inspiring Govt Teacher in Adilabad : "గురువంటే నిత్యచైతన్య దీప్తి, గురువంటే అక్షరాల దీపం వెలిగించే కాంతిపుంజం". తల్లీదండ్రుల తర్వాత పిల్లల తలరాతను మార్చే మంత్ర దండం. ప్రైవేటు మోజుతో విద్యా బోధనలలో కొత్త పోకడలు పోతున్న తరుణంలోనూ ప్రభుత్వ బడినే ప్రయోగశాలగా మార్చే గురువులు లేకపోలేదు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే మార్గదర్శకులకూ కొదవలేదు. అలాంటి కోవలోకే వచ్చే ఓ పంతులమ్మ కథ ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 10:59 AM IST

Updated : Jul 6, 2024, 11:58 AM IST

Story on Komaram Bheem Colony Govt School Teacher
Inspiring Govt Teacher in Adilabad (ETV Bharat)

Story on Komaram Bheem Colony Govt School Teacher in Adilabad : 'కుమురం భీం కాలనీ ప్రభుత్వ పాఠశాల' అని నాలుగక్షరాలతో సాదాసీదాగా రాసి ఉన్న ప్రహరీని చూస్తే ఇదేంటీ? అని అనుకోవచ్చు. కానీ ఇందులో 83 మంది విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందంటే నమ్ముతారా? అందుకు కొత్తూరి శ్రీలత అనే ఈ పంతులమ్మ కారణమంటే నమ్మగలరా? కానీ మీరు విన్నది నిజమే. ఆదిలాబాద్‌లోని కుమురం భీం కాలనీలో మూతపడిన పాఠశాలను 2019లో తిరిగి తెరిపించారీ టీచరమ్మ.

డ్రాపవుట్లుగా ఉన్న 40 మంది పిల్లలను చేరదీసి బడిబాట పట్టించారు ఈ టీచరమ్మ. బడికి భవనం లేనందున సొంత డబ్బులతో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, ఐదేళ్లుగా పాఠాలు చెబుతున్నారు. ఆమె ప్రయత్నం వల్ల కాలనీ వాసుల్లో మార్పు వచ్చింది. విద్యార్థుల సంఖ్య 83 మందికి చేరింది. ఆటపాటల మధ్య పేద విద్యార్థుల చదువు ఆనందంగా సాగుతోంది. 2010లో కుమురం భీం కాలనీకి ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది.

2012లో ఆక్రమణల తొలగింపులో భాగంగా ఈ కాలనీని అధికారులు ఖాళీ చేయించారు. ఫలితంగా పాఠశాల మూతపడింది. అయితే విద్యాశాఖ రికార్డుల్లో బడి పేరుండటంతో 2018లో అక్కడికి శ్రీలత అనే టీచర్‌ బదిలీ అయ్యారు. తీరా అక్కడికెళ్లి చూస్తే బడీ విద్యార్థులు ఎవరూ లేరు. విషయం అప్పటి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ దృష్టికి వెళ్లడంతో శ్రీలతను ఆమె ముందు పనిచేసిన సాంగిడికి మళ్లీ డిప్యూటేషన్‌పై పంచించారు. ఇక్కడితో కథ పరిసమాప్తం అయ్యిందని అందరూ అన్నారు.

40 మంది డ్రాపవుట్ల విద్యార్థుల కోసం :శ్రీలత టీచర్ డిప్యూటేషన్‌పై వెళ్లినప్పటికీ ఆమె దృష్టి అంతా కుమురం భీం కాలనీ చుట్టే తిరగటం ప్రారంభమైంది. ఈలోగా నిర్వాసితులైన పేదలకు మరో చోట ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించగా, కొత్త కాలనీ ఏర్పడింది. కానీ అందులో బడి ప్రస్థావనే లేదు. వేసవి సెలవుల్లో శ్రీలత తన భర్త అశోక్‌తో కలిసి వెళ్లి కాలనీలో పరిశీలించగా, 40 మంది పేద విద్యార్థులు డ్రాపవుట్లగా మారినట్లు తేలింది. వారికెలాగైనా చదువు చెప్పాలని భావించిన పంతులమ్మ, సాంగిడిలో డిప్యూటేషన్‌ రద్దు చేసుకొని కుమురం భీం కాలనీకి వచ్చేసింది.

సొంత డబ్బులతో అద్దె చెల్లిస్తూ పాఠశాలను శ్రీలత తిరిగి ప్రారంభించారు. నాలుగేళ్ల కింద ఈ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ బడి కోసం 4 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారు. దివ్యదేవరాజన్‌ బదిలీ కావటంతో పక్కా భవన నిర్మాణం రూపుదాల్చలేదు. అయినా శ్రీలత వెనకడుగు వేయలేదు. ప్రస్తుత కలెక్టర్‌ రాజర్షిషా భవనం కోసం రూ.20 లక్షలు మంజూరు చేయడంతో శ్రీలత చొరవ వృథా పోలేదని తేలింది.

ఇతర ప్రభుత్వ పాఠశాలల కంటే తీసిపోని విధంగా మధ్యాహ్న భోజనం, ఆటపాటల మధ్య కృత్యాధార బోధన సాగుతోంది. ఐదు తరగతుల విద్యార్థులకు పాఠాలు చెబుతూ చదువులమ్మగా శ్రీలత అభినందనలు అందుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంతో పేద విద్యార్థులకు ఓ పూట ఆకలి తీరుతోంది. మధ్యలో ఆగిపోయిన చదువులు మళ్లీ వికసించాయి. రికార్డుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో మూతపడిన పాఠశాలను తిరిగి తెరిపించటం ఓ సగటు ఉపాధ్యాయురాలిగా అసాధ్యమే. కానీ అసాధ్యాన్ని శ్రీలత టీచర్‌ సుసాధ్యం చేయటం అభినందనీయం.

'నాకు ఎక్కడ కేటాయించారో అక్కడే ఆ పాఠశాలలోనే డిప్యూటేషన్‌ కాకుండా సొంతంగా స్కూల్​ను రన్​ చేయాలని అనుకున్నా. సమ్మర్​లో ఇక్కడ నేను సర్వే చేశా. పేద పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో సొంతంగా పాఠశాల కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నా. ఉపాధ్యాయురాలిగా పేద పిల్లలకు విద్యను అందించడం నాకు తృప్తిని ఇస్తోంది'- శ్రీలత, ఉపాధ్యాయురాలు

గురుభక్తి అంటే ఇదేనేమో - బదిలీ అయిన టీచర్ - ఆయన వెళ్లిన బడిలోనే చేరిన విద్యార్థులు - STUDENTS TRANSFERRED WITH TEACHER

Last Updated : Jul 6, 2024, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details