Land Encroachment in Mallavalli: కృష్ణా జిల్లాలో మల్లవల్లిలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల పోరంబోకు భూమి గత ప్రభుత్వ హయాంలో మాయమైంది. దొంగపట్టాలు సృష్టించి ఇష్టానుసారం పంచిపెట్టడంతో, పట్టాలు ఉన్న రైతులకూ భూమి లేదనే పరిస్థితి తలెత్తింది. ఇక్కడి పారిశ్రామికవాడను అడ్డుపెట్టుకుని గత పాలకులు దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అసలు భూమిలేనివారి పేర్లు రికార్డుల్లో కనిపిస్తున్నాయని, తరాలుగా పంటలు పండించుకుని పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్న తమ పేర్లు రికార్డుల్లో మాయం చేశారని రైతులు వాపోతున్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేసింది. అడవి పోరంబోకు భూములు 1466 ఎకరాలు సేకరించింది. ఇందులో 13 వందల 66 ఎకరాలు ఏపీఐఐసీకి ఇవ్వగా, మరో 100 ఎకరాలను సామాజిక అవసరాలకు కేటాయించారు. వాస్తవానికి మల్లవల్లిలోని సర్వే నంబరు-11 అడవి పోరంబోకుగా ఉంది. కానీ ఎంత విస్తీర్ణంలో ఉందన్నది ఆర్ఎస్ఆర్లో లేదు. దీనిపక్కనే సర్వే నంబరు 5లో పట్టా భూమి ఉంది.
ఇది 308 ఎకరాలుగా గ్రామ పటంలో గుర్తించారు. వీటికి ఆనుకుని సర్వేనంబరు 1లో 130 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. ఇందులో 30 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇవ్వగా, మిగిలిన భూమి వైఎస్సార్సీపీ నేత ఆక్రమించి సాగు చేస్తున్నాడు. గత ఐదేళ్లలో ఈ మూడు సర్వేనెంబర్లలోని భూముల రికార్డులు మార్చి ఇష్టానుసారం రిజిస్ట్రేషన్లు చేశారు. దీంతో ఒరిజనల్ పట్టాలు ఉన్న రైతులు ఆందోళనకు దిగారు.